వినాయకుని గాణా పత్యము
శ్లో॥ అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావన మచింత్య వైభవమ్ తం నరం వపుషి కుంజరమ్ ముఖే మన్మహే కిమపి తుందిలం మహః ॥
దేవతలలో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు విచిత్రమైన రూపాలలో. నరసింహుడొకడు నరకుంజరుడొకడు. నరసింహుడు శ్రీ మహా విష్ణువైతే నరకుంజరుడు మహాగణపతి. ఇద్దరూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోస మవతరించిన వారే. హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి నరసింహావతారమైతే – మానవులను బాధించే విఘ్నాలనే దుష్ట శక్తులను పారదోలి వారి కార్యాలను నిర్విఘ్నంగా సాగించటానికే వినాయకుడి అవతారం. వినయమంటే శిక్షణమని అర్థం. శిక్షణ చేసే వాడెవడో వాడు వినాయకుడు. దుష్టశక్తులను శిక్షించే వాడని భావం. అవి ఏవోకావా శక్తులు. భూత ప్రేతాది ప్రమథగణాలే. నిత్యమూ మానవ జీవితాన్ని మథించే స్వభావమున్నది గనుక వాటికా పేరువచ్చింది. మానవుడే సత్కార్యం తలపెట్టినా అవి దాడి చేస్తుంటాయి. అది వాటి స్వభావం. అలా చేస్తుంటే వాటి బారి నుంచి తప్పించు కోవాలని చూస్తాడు సాధకుడు. అందుకే సంధ్యా వందనాదులైన కర్మ లాచరించేటప్పుడు “ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ” అని మనం సంకల్పం చెప్పుకోటం.
ఇలాంటి అసురగణా లన్నిటినీ అదుపులో పెట్టి సాధకులైన మానవులకు కార్య సిద్ధిని ప్రసాదించటానికే వినాయక స్వామిని సృష్టించారా ఆదిమ దంపతులు.
Page 74