ఈ ఆదర్శాన్నే సంప్రదాయమని ఆరచననే కల్పన అని ఆధునికులు వ్యవహరిస్తుంటారు. దీనినే పాశ్చత్య విమర్సకులు Tradition అని Novelty అని పేర్కొంటున్నారు. రెండింటినీ మేళవించి ఒక సరసమైన పాకంలో అందిస్తూ సమకాల సాహిత్యంలో ఒక క్రొత్త మలుపును సృష్టించగల వాడే కవి బ్రహ్మ అనే మాటకు అర్హుడవుతాడు.
మొట్ట మొదట ఇలాంటి అర్హత తెలుగు కవులలో సాధించిన వాడు నన్నయ భట్టారకుడు. భారత కథ నెపంగా పురుషార్ధాలు నాలుగింటినీ బోధించాడు లోకానికి. ప్రసన్న కథా కలితార్థయుక్తి అదే. అర్ధమంటే పురుషార్ధమే. అది కథ లోనే అంతర్గతంగా ప్రవహింప జేశానని ఆయన సూచన. అదే కావ్యాని కాదర్శం. పోతే కవి దాని కనుగుణంగా చేసిన రచన కథా కథనంలో ఆయన చూపిన చమత్కారం. “ఏయది హృద్యమ పూర్వం బేయది యెద్దాని వినిన ఎరుక సమగ్రంబై యుండు నఘ నిబర్హణ మేయది అని నాలుగు లక్షణాలు చెప్పాడు కథకు. అవి చక్కగా సమన్వయించి చూపటంలో ఉందాయన ప్రతిభ. దీన్ని బట్టే ఆయన 'విద్యా దయితుండ' ని ప్రశంస పొందాడు. పోతే ఇక తిక్కన గారు సరేసరి. సాక్షాత్తు గానే కవి బ్రహ్మ ఆయన. " తన కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదునా” అని ప్రబంధ పరమేశ్వరుని చేతనే భేషని పించుకొన్నాడు. ఆదర్శమదే. నన్నయ గారిదే. "తా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్” అనే వాక్యంలో పురుషార్ధాలనే కావ్యార్ధంగా వ్యక్తం చేశాడు. ఐతే తన ఆదర్శం ప్రాతదైనా "ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగా” తన కథను ఊర్జితం చేసి హృదయాహ్లాదిగా తీర్చిదిద్దాడు. అందులో ఉంది ఆయన ప్రౌఢి.
Page 62