అయినా దానికే మాత్రమూ వెనుకకు తగ్గలేదు దానవ చక్రవర్తి. ఏమైనా ఆపదరానీ. అది నరకమే గానీ స్వర్గమే గానీ - వచ్చి అడిగినవారు హరియే గానీ హరుడే గానీ - ఒక మారు ఇస్తానని మాట ఇచ్చిన తరువాత ప్రాణం పోయినా నేనిక మాట తప్పనంటాడా మహాదాత. ఏమి దాతృత్వమేమి ధైర్యమిది. ఒక దానవుడిలోనే ఇంత దాతృత్వమింత, ధైర్య మింత, స్వార్ధ త్యాగ మింత ప్రతిజ్ఞాపాలన ముందంటే మానవులుగా జన్మించిన మనలో అవి లేనందు కెంత సిగ్గు పడాలి. వెంటనే అవి అలవరుచుకొని ఇప్పటికైనా బాగుపడండని మహాకవి చేసే ప్రబోధమేగా మనకిది.
"తండ్రులు మీరు మీకు ..... చిక్కక యుండఁగావుడీ" శ్రీ కృష్ణుడు తపశ్చర్యకయి బదరికాశ్రమం వెళ్ళుతున్నాడు. తన పరోక్షంలో ద్వారకా పట్టణాని కేమి ముప్పు వాటిల్లుతుందో నని ఆయన భయం. ముఖ్యంగా పౌండ్రకుడని ఒకడున్నాడు. వాడెప్పుడెప్పుడు దూకుదామా అని చూస్తున్నాడు. కృష్ణుడు లేడని తెలిస్తే వాడికిక లగ్గల కెక్కినట్టే. అంచేత బలరామాదు లందరికీ ముందుగా చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి కడసారిగా గురువు గారైన ఉద్ధవాచార్యులను సమీపించి వారితో ఇలా విన్నపం చేస్తున్నాడు. మీరు మాకు తండ్రితో సమానులు. మీకు మేము చెప్పటానికి మేమెంత వాళ్ళం. ఒక వేళ చెప్పినా లోకులు బ్రువ్వదిట్టరా. బృహస్పతి అంతవాడు మీకు సరిపోలడు. కాబట్టి మీకు నీతులు బోధించటమేమిటి హాస్యాస్పదం. అయితే ఒక్కమాట. నేనులేనని తెలిస్తే ఆ పౌండ్రక వాసుదేవు డెత్తి రావచ్చు.
Page 45