23. ఈ రీతిగా మానవుడి అంతః ప్రకృతిని చిత్రీకరించడంలో ఎన్నో రేఖా చిత్రాలను గీయటమే గాక ప్రౌఢులైన మహాకవు లప్పుడప్పుడు బాహ్య ప్రకృతిని వర్ణించడంలోకూడా వాటిని మధురాతి మధురంగా ధ్వనింపజేస్తారు. అది రెండింటి శోభనూ పుడికి పుచ్చుకొని ద్విగుణీకృతంగా వెలిగిపోతుంది. అచేతన వర్ణనలో చేతన వ్యవహార మని అలంకారికులు వక్కాణించిన కావ్య మర్మ మిదే.
"కలయ జగమునఁగల యట్టి నలుపు లెల్ల తెలుపులుగఁజేసి నీడలు తెలుపు సేయ వశముగామిఁ బొడము దుఃఖమునఁబోలె సాంద్రచంద్రిక తుహిన బాష్పములు గురిసె "-
పున్నమి వెన్నెలను వర్ణిస్తున్నాడు కవి. పిండి ఆరబోసినట్టు పండు వెన్నెల నలుదిక్కులా నిండికాస్తున్నది. ఆ తెలుపులో ఎక్కడగానీ నలుపనే వార్త కూడా లేకుండా పోయింది. ఎంత దూరం ప్రసరిస్తే అంత మేర అది నలుపు లన్నింటినీ తెలుపుగా మార్చగలిగింది. కాని ఒక్క నలుపును మాత్రమది అలా మార్చలేక పోతున్నది. అవే అక్కడక్కడ చెట్లలో చేమలలో కనిపించే నీడలు. ఎంతశ్రమపడినా వాటిని మాత్ర మది తెలుపు చేయ సాధ్యం కాలేదు. అందుకు తీవ్రమైన పరితాపం చెందిన ఆకౌముది కనుల నుండి అప్రయత్నంగా దుఃఖాశ్రుకణాలు జాలువారాయి. అందుకు నిదర్శనం ఇక్కడా అక్కడా చిందిపడిన మంచుబిందువులేనని మనకు నచ్చజెపుతాడు మహాకవి. నిజంగా వెన్నెల కలాంటి నిర్వేదం కలిగిందా. సృష్టిలో అది ఒక అచేతనమైన పదార్థం. దానికీ నలుపులన్నీ తెలుపు చేయాలనే తలపూ లేదు. చేయలేక పోయాననే పరితాపమూ లేదు.
Page 38