21. "అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయింబొడ తేర - గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందెలు నుంగుడు వంగబెట్టు నిర్భర కరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే - హరహర! ఎవ్వరింక కడుపారసి పెట్టెద - రీప్సితాన్న ముల్” ఇది కాశీ ఖండంలో శ్రీనాధుడు వ్రాసిన పద్యం. గుణనిధి ఉపాఖ్యానం లోనిది. వాడు తండ్రి మాట వినక బాల్యం నుంచీ ఆటకూటాయిగా తిరిగిన బాపతు. తల్లి గారాబం జాస్తి వాడికి. చివరకు తల్లిదండ్రులకు దూరమై బ్రతుకు బండలు చేసుకొని తిన తిండి లేక అలమటిస్తూ ఒకనాడు ఒంటరిగా తనలో తానిలా వాపోతున్నాడు. “తండ్రి ఎంతకోపగాడైనా ఆయన చెవికి రాకుండా తన తప్పులన్నీ కప్పి పుచ్చి కంటికి రెప్పలాగ కాపాడింది నా తల్లి. ప్రతిరోజు తెల్లవారగానే పిల్ల వాడెంత ఆకలిగా ఉన్నాడోనని వెండి గిన్నెలో పెరుగన్నం కలిపి తెచ్చినాకు పసివాడికి వలె తినిపించేది. అలాంటి దయామయి తల్లి ఇప్పుడేది. ఇక నా కడుపు చూచి తిండి పెట్టు దిక్కెవ్వరు. చూడండి. వాడెంత సోమరి అయినా పశ్చాత్తాపంతో వాడనే ఈ మాటలు లోపలపడే వాడి ఆవేదన నెంతగా బయటపెడు తున్నాయో దానిని వింటుంటే మన హృదయానికి కూడా ఎలాంటి ఆవేదన కలుగుతున్నదో. ఒక ఆవేదనే కాదు - దాని వెనకాల దాగి ఉన్న ఒక తల్లి కొడుకుల అనుబంధమూ – దైవికంగా దానికి దూరమైతే దాని కోసం పడే ఆరాటమూ - ఒక మానవుడు తాను చేసిన పొరపాటుకు చెందే అనుతాపమూ - మాతృదేవత ప్రతి ఫలం కోరని పుత్రవాత్సల్యం లోని విలువా - ఎన్నో భావాలు కన్నుల ఎదుట సాక్షాత్కరిస్తాయి. మనలను తన్మయత్వంలో ముంచి వేస్తాయి.
Page 36