పోతే వీరు బాగా వృద్ధులైన తరువాత రచించిన మహాకావ్యం మరొకటి ఉంది. అది వారి రామాయణం. వాల్మీకాన్ని చక్కగా అవగాహన చేసుకొని రచించిన ఈ గ్రంధం చాలా విపులమైనది. పరిమాణంలోనే కాదు. గుణంలో కూడా ఇది ప్రశంసనీయమే. ఒక మారు శాస్త్రులు గారి ఇంట్లోనే దీన్ని గురించి ప్రస్తావన వచ్చింది. నాకొక్కడికీ అందులో కొన్ని పద్యా లక్కడక్కడ చదివి వినిపించారు. శివ భారతంలో ఉండే పొంగు కూడా తగ్గి ఇది ఇంకా సరళంగా సుందరంగా నడిచింది. రామ కధలోని అన్ని అంశాలను స్పృశిస్తూ ఆ కధలోని రహస్యార్ధాలను గూడా ఎంతో వ్యంగ్యంగా ప్రదర్శిస్తుందీ మహాకావ్యం.
ఇలా భారత రామాయణాలను రెండింటిని భావన చేసి మరలా భారతీయులకు వైయక్తిక సామాజిక ధర్మాలను రెండింటిని ప్రబోధించి నిజమైన ప్రగతి పధంలో అడుగుపెట్టించిన ఈ మహాకవి ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు.
వీరి రచన మాదిరే వీరి జీవితం కూడా చాలా నియమ బద్ధమైనది. వ్రాతే కాక మాట కూడా మంచి నిగ్రహం కలిగి ఉంటుంది. వీరి బోధనా పాటవమెంతో మనోజ్ఞంగా ఉండేదని అది వారి కొక ప్రత్యేకమైన కళ అని ఇప్పటికీ వారి శిష్యకోటి వేనోళ్ళ పొగుడుతూ ఉంటుంది. ఇక వయస్సు మళ్ళే వరకు వారు చేసిన అష్టావధాన శతావధానాల విషయం చెప్పనే అక్కరలేదు. అంతో ఇంతో అన్ని విషయాలలోనూ ప్రవేశ ముండేది శాస్త్రి గారికి. అన్నిటిని మించి వారిలో నాకు గొప్పగా నచ్చిన విషయాలు రెండున్నాయి. ఎదుటివారిని నొప్పించకుండా తనకు గిట్టని వారినైనా సరే
Page 15