జీవుడనే భావాన్ని వదలకుండానే అడుగుతున్నావు. కాబట్టి అడిగినా సుఖం లేదు. జీవుడనే భావంతోనే పరిష్కారాన్ని అందుకోలేవు. చెప్పినా గ్రహించ లేవు.
ఇది ఎలాంటి దంటే ఒకడు స్వప్నంలో ఉండి స్వప్న జగత్తును చూస్తున్నాడు. - ఇది స్వప్నం - వాస్తవం కాదని ఎవడు చెప్పినా నమ్మడు వాడు. కారణం వాడు స్వప్నంలోనే ఉన్నాడు. సమాధానం చెప్పే వాణ్ణి వాడి సమాధానాన్ని కూడా స్వప్నంగానే చూస్తాడు. అది యథార్థం కాదనే మాట ఇక ఎలా అర్ధమౌతుంది వాడికి. అలా కాక వాడే స్వప్నంలో నుంచి మేలుకొని జాగ్రత్ లోకి వచ్చాడనుకోండి. అప్పుడు వాడికిది ఏమిటి ? ఎందుకనే ప్రశ్నే రాదు. కాబట్టి ఎవరూ పరిష్కరించి చూపనక్కరలేదు. తన పాటికి తానే తెలుసుకోగలడు. వెలుగు చీకటుల లాంటి దిది. చీకటిలో ఉన్నంత వరకు ఇదుగో నల్లగా కనపడుతున్నదిదే వాస్తవం. వెలుగెక్కడ ఉంది. ఒక వేళ ఉందని చెప్పినా అది నాకు చీకటి అయి ఎందుకు కనిపిస్తున్నదని ప్రశ్నిస్తావు. నీవు చీకటినే చూస్తూ వెలుగిలా ఎందు కయిందని ప్రశ్నించి ఏమి లాభం. చీకటనే దృష్టి వదలలేదు. నిన్ను. ఆ దృష్టి వదల కుండా పట్టుకొనే సరికి వెలుగే చీకటయి భాసిస్తున్నది. మరి దీని కేమిటి పరిహారం. ఒక్కటే. వెలుగును చూడటమే. అప్పుడు నీ దృష్టి వెలుగయింది కాబట్టి దానికిక చీకటి లేదు. అంతా వెలుగే. వెలుగే కదా ఉన్నది అది చీకటి ఎలా అయింది ఎందుకయిందని అడగనే అడగవు. ఎందుకంటే చీకటి అనే భావమే లేదు నీకు.
కనుక అజ్ఞాన మెక్కడిది ? జీవుడెక్కడి వాడు ? అది ముందా ? ఇది ముందా ? అనే వితర్కం అనావశ్యకం. ఎంత వితర్కించినా దానికి సమాధాన మెప్పటికీ రాదు. సమాధానమే కావాలంటే ఎందుకని కాదు నీవు ప్రశ్నించ వలసింది. ఇది ఎలా పోతుందని.
Page 138