#


Index

  కనిపించే కొద్దీ దానితో అతడు తాదాత్మ్యం చెందాడు గనుకనే విశేష దృశ్యమైన జగత్తుతో కూడా చెందుతూ వచ్చాడు. అలా చెందే సరికి దాని కష్ట సుఖాలు వీడికి సంక్రమించాయి. ఇదే సంసారానుభవం. విశేషమే నేననుకొనే సరికి విశేష ధర్మాలన్నీ నావే అవుతాయి. 'యద్భావ స్తద్భవతి' ఈ విశేష ధర్మాలే సుఖదుఃఖాలు - జనన మరణాలు.

  ఐతే ఆత్మ - అనాత్మ రెండే అన్నారు కదా పదార్ధాలు. అలాంటప్పుడీ జీవాత్మ అనే మూడవవాడు ఎలా వచ్చాడు. రాలేదు వాస్తవంలో. రావటానికి వీలు కూడా లేదు. ఐనా వచ్చాడంటే ఆ రావటం వాస్తవం కాదు. మరేమిటి. ఆభాస. దానికి కారణం ఆవిద్య లేదా అజ్ఞానం. సామాన్య చైతన్యం మాత్రమే నాస్వరూప మని గుర్తించక పోవటమే అజ్ఞానం. గుర్తిస్తే చిద్విశేషమైన జీవుడు లేడు. సద్విశేషమైన జగత్తూ లేదు. ఎందు కంటే సామాన్యం కంటే భిన్నంగా ఉండలేవు విశేషాలు. కనుక జీవ జగత్తులు రెండూ లేవు. రెండూ లేకుంటే ఈశ్వరుడు కూడా ఉండబోడు. ఈశ్వరుడనే వాడు జీవుడు కల్పించుకున్న ఒక సగుణమైన సమష్టి చైతన్యం.

  ఇవి మూడే త్రిపుటి అంటే. జీవ జగదీశ్వరులు. చిత్రమేమంటే ఈ త్రిపుటి ఒక దానితో ఒకటి ముడిబడి ఉంది. అది అవిద్యతో ముడిబడి ఉంది. అవిద్య లేకపోతే దీని కస్తిత్వం లేదు. అవిద్య అంటే అజ్ఞానమని చెప్పాము. అజ్ఞాన మంటే జ్ఞానం లేకపోవటం కాదు. విశేష రూపమైన జ్ఞానం. ఫలానా అనే దృష్టితో ఫలానా అని చూడటం. చూస్తే ఫలానా అనే దృశ్యం ఫలానా అనే దృష్టికి బంధకమై కూచుంటుంది. ఇదే మనకు పట్టుకున్న సమస్య. మనమంతా ప్రస్తుత మీ సమస్యతో సతమతమౌతున్న జీవులం. నిజానికి సామాన్య చైతన్యమైన పరమాత్మ స్వరూపులమే మనం. అయి కూడా కాదనుకున్నాము.

Page 134