ఈ సద్వి శేషానికే రూపమని గూడా పేరు. లోపల చిద్విశేషమైన నామం జీవుడు వెలపల సద్విశేషమైన రూపం జగత్తు. ఈ రెండింటిలో ఒకటి గ్రహించేది ఇంకొకటి గ్రహించబడేది. రెంటికీ ఉన్న సంబంధమే క్రియ. నామ రూపాలు రెండూ రెండు తీరాలైతే క్రియ అనేది రెండు తీరాలనూ కలిపే ఒక పెద్ద వంతెన. ఇదే త్రిగుణాత్మకమైన సంసారం.
ఈ సంసారమే ఇప్పుడు మనకెదురైన సమస్య. దీని వల్లనే సుఖదుః ఖాదుల అనుభవం ఏర్పడుతూ ఉంది. చివరకు జనన మరణానుభవం కూడా దీని వల్లనే సంప్రాప్త మౌతున్నది. ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఏముంది. ఎవరికీ సమస్య. ఎవరనుభవిస్తే వారికి. ఎవడా అనుభవించే వాడు. ఆత్మ కాదు. ఆనాత్మ జగత్తు కాదు. ఆత్మ అనేది నిరాకారం సర్వవ్యాపకం పరిపూర్ణమని చెప్పాము. పోతే అనాత్మ అనేది కేవలం జడం పరిచ్ఛిన్నమని పేర్కొన్నాము. సమస్య ఎప్పుడూ పరిపూర్ణమైన చేతనకూ లేదు. పరిచ్ఛిన్నమైన జడానికీ లేదు. కారణం మొదటి దానికి విశేష దృష్టి లేదు. రెండవ దానికి అసలు దృష్టే లేదు. కనుక విశేష రూపమైన ఈ సంసారానుభవం రెండింటికీ లేదు.
ఆత్మా నాత్మలకు రెండింటికీ లేకపోతే మరి దేనికిక ? మూడవదైన జీవుడికే ఈ అనుభవం. వీడు ఆత్మలాగా సామాన్య దృష్టీ కాదు. అనాత్మ ప్రపంచం లాగా కేవల దృశ్యమూ కాదు. దృక్ - దృశ్యాల రెండింటి కలయిక. దీనినే గ్రంథి అని వర్ణించారు. దృశ్యంలో కొంత నేనని తనలో కలుపుకున్న దృక్కు. సామాన్య చైతన్యం కాదిది. విశేష చైతన్యం. దీనికే చిదాభాసుడని జీవాత్మ అని పేరు. వీడికున్నది విశేష దృష్టి మాత్రమే. వచ్చిన ఇబ్బంది ఏమంటే విశేష దృష్టితో చూస్తే ఎప్పుడూ విశేష దృశ్యమే కనిపిస్తుంది.
Page 133