పుస్తకాలలో ఉండే విషయాలన్నీ గ్రహించగలం. గణిత వైద్య జ్యోతిషాదులేమిటి. వేద శాస్త్ర పురాణాలేమిటి. అన్నీ గ్రహించగలం. పరమాణువుకన్న చిన్నదైనా మానవుడి మనస్సులో ఎంత విజ్ఞానమైనా ఇముడ్చుకునే శక్తి ఉంది. ఎన్ని ప్రపంచాలైనా అందులో ఇమిడిపోతాయి. అది ఒక పుష్పక విమానం. ఒకసారి సంకల్పించిం దంటే పాతాళం నుంచి పరమేష్ఠి లోకం దాకా పరుగెత్త కలదు. తూర్పు నుంచి పడమర దాకా చుట్ట బెట్టుకొని రాగలదు. మర్త్యమైన ఈ జగత్తులో ఉండి కూడా అమర్త్యత్వాన్ని గూర్చి ఆలోచించగలదు. సాగర గర్భంలో దాగి ఉన్న తిమింగిలాన్ని గూడా గాలం వేసి పైకి లాగ గలదు. అంతరిక్షంలో పారిపోయే పక్షిని గూడా భూమి మీద పడగొట్టగలదు. మరి సింహ శరభ శార్దూలాది ఘాతుక మృగాలను గూడా ఉపాయంతో పట్టుకొని స్వారి చేయగలదు. ఇదంతా జ్ఞాన ప్రభావమే. ఈ విద్యలన్ని మానవుడు సాధించ గలిగినవే.
ఇవన్నీ మానవుడికి లభించేది పంచేంద్రియాల ద్వారానే. పాంచ భౌతికమైన జగత్తు సంతా గ్రహించటానికి పంచేంద్రియాలే దారులు. పోతే ఈ ఐదుగాక ఆరవ మార్గం ఒకటి ఉంది మానవుడి అంతరంగంలో. అది ఆదివ్య జగత్తులోకి తెరచుకొని ఉన్న ఒక అద్భుతమైన ద్వారం. అవి భౌతిక జగత్తువైపు అయితే ఇది అ భౌతికం వైపు తిరిగి ఉంటుంది. నూటికి తొంబది మందికి ఇది అంతుపట్టదు. జ్ఞాన శక్తిలో ఇది రెండవ అంతస్తు. దీని ద్వారా ప్రయాణం చేసి చేరవలసిన గమ్యం ఒక్కటే. అది బ్రహ్మాత్మ భావం. దానికే మోక్షమని మరి ఒక నామధేయం. ఇది ప్రత్యక్ష, అనుమానాలనే రెండు ప్రమాణాలకు అగోచరమైన దశ. అలాంటప్పుడు ఇది ఒకటి ఉందో లేదో అనే సందేహం కలగటం సహజమే.
Page 120