#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

తీరని విషాద వలయంలో తగులుకొని దానివలన బయటపడే మార్గానికి నోచుకోని మానవుడి కందులో నుంచి విముక్తి పడయటాని కుపాయమే భాగవత కథ అంతా. ఇందులో విషాదమాది అయితే తద్విమోచనం దానికంతం. అదే పరీక్షత్తు నెపంగా మహర్షి సాగించిన ప్రధాన కథా వస్తువు. పోతే ఈ కథలో అంతర్వాహినిగా ప్రవహించే ఆధ్యాత్మిక విద్యా సంప్రదాయాన్ని బలపరచటానికే మధ్యలో ఏకరువు పెడుతూ వచ్చిన ప్రాసంగిక కథలన్నీ. కథలూ, పాత్రలూ, సన్నివేశాలూ అనేవి వాటికోసం చెప్పినవి కావు. అవన్నీ కేవలం సంకేతాలు మాత్రమే. ఆధ్యాత్మికమైన ఒకే ఒక సత్యాన్ని చెప్పటానికి ఆధిభౌతికమైన స్థాయిలో అల్లుకొన్న అనేక సంకేతాలవి. ఒక ప్రహ్లాదుడి కథ వర్ణించినా అందుకే. ధ్రువుడి కథ అయినా అందుకే. అంబరీషుడిదైనా అందుకే. పృథువుదైనా అందుకే. కుచేలుడిదైనా అందుకే. గజేంద్రుడిదైనా అందుకే. చివరకు గోప గోపిక లేమిటి కాల యవనాది రాక్షసులేమిటి అనుకూల ప్రతికూల మార్గాలలో నడచిన ప్రతి ఒక్క పాత్రకు చెందినకథా అందుకే. అనాత్మ జగత్తు మీద వైముఖ్యం కలిగించి చివరకు ఆత్మతత్త్వం మీద ఆభిముఖ్యం కలిగించేటందుకే మరెందుకూ కాదు. ఇదే భాగవత పురాణ శరీరమంతా అణువణువూ వ్యాపించి ఉన్న అంతరార్థం. ఇదే పురాణ హృదయమన్నట్లు పురంజనో పాఖ్యానాదులలో బయటపడి బాహాటంగానే చాటాడు మహర్షి. అది ఒక నమూనాగా భావించి మిగతా గ్రంథమంతా ఆ పంథాలోనే సమీక్షించమని బహుశా ఆయన మౌనంగా మనకందజేసే సందేశమయి ఉండవచ్చు.

Page 80

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు