సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
ప్రతి శాపమివ్వాలనే చూచాడు పరీక్షిత్తు. ఇవ్వగలడు కూడా. అయితే అనవసరమూ అనుచితమూ అని తోచిందాయనకు. ఏమి కారణం. ఆ పాటికి ఆత్మ పరీక్ష చేసుకొని నిజమైన పరీక్షిత్తుగా మారాడు. “ఏటికి వేట వోయితి ఏటికి తద్భుజాగ్రమున నేసితి సర్ప శవంబు - నేనేటికి పాప సాహసము లీక్రియ జేసితి" ఇంతకూ “దైవ యోగమున్ దాటగ రాదు గదా” మరి “రాజ ననుచు బోయి రాజ్య గర్వంబున దంద శూక శవము తండ్రిపై వైచిన పొలియ దిట్టకేల పోవు సుతుడు” అని ఇలా విచారణ చేసి సామర్థ్యము కలిగి కూడా భూమీశు డలుగడయ్యె నట. స్వయం కృతాప రాధానికి వగచి ఏమి ప్రయోజనం. ఒకరి నని ఏమి ప్రయోజనం. అయితే దానికి కూడా ఎంతో వివేచనా బుద్ధి ఉండాలి మానవుడికి అది తాత్కాలికంగా మరుగుపడినా తరువాత ఉదయిస్తుంది. పశ్చాత్తాప మొదవిస్తుంది. అది వైరాగ్యానికి దారి తీస్తుంది. "పరీక్ష్యలోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాత్ - నాస్త్యకృతః కృతేన" అన్న దుపనిషత్తు. నిరంతర పరిణామ శీలమైన ఈ ప్రపంచ వ్యవహారంలోని ఒడుదుడుకులు బాగా పరీక్షించి చూచినప్పుడు గాని మానవుడికి నిర్వేదం కలిగి ఆత్మజ్ఞానాని కభిముఖుడు కాడు. ఇదుగో ప్రస్తుతం పరీక్షిత్తుకు కూడా అలాటి అభిముఖ్యమే కలిగిందీ శాపం వల్ల. అంతేకాదు.
తస్యైపమే 2 ఘస్య పరా వరేశో వ్యాసక్త చిత్తస్య గృహేష్వభీక్షమ్ నిర్వేద మూలో ద్విజశాప రూపః
యావజ్జీవమూ ఈ సంసార సాగరంలో పడి మునగానాం తేలానాం కాకుండా నాకొక గమ్యం చూపటాని కాపరమేశ్వరుడే ఈ బ్రాహ్మణ శాపరూపంలో నాకు ప్రత్యక్షమయి ఉంటాడు. సందేహం లేదని శాపాన్ని కూడా తనకొక వర ప్రసాదంగా భావించాడు మహానుభావుడు. జీవితంలో ఒకటి మనకు ప్రతికూలంగా జరిగినా అందులో కూడా ఏదో మనకు తెలియని సత్ఫలితముంటుందని గ్రహించటమే గొప్ప వివేకం. అదే భాగవత శ్రవణానికి దారి తీసింది పరీక్షిత్తుకు. ఈ శ్రవణం ఏడు రోజులు చేయటంలో కూడా అంతరార్థమున్నది. ఏడు రోజులకు తక్షక విషాగ్నిచేత మరణించే
Page 76