#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

వెంటనే చంద్రహాసం దూసి వాడిమీదికి లంఘించాడు. అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించాలి రాజు. ఇంతకంటే రాజుకు కర్తవ్యమేముంది. అలాటి పవిత్రమైన కార్యాన్నే పాటించాడు. దానికి హడలిపోయి వాడు కాళ్లమీద పడ్డాడు. శరణా గతుణ్ణి రక్షించమని మొరపెట్టాడు. అందితే జుట్టు అందకుంటే కాళ్లనే వ్యవహారమిదే. శిక్షించేవాడు లేనంతవరకూ విచ్చలవిడిగా విహరిస్తుంది అధర్మం. శిక్షకుడుంటే ప్రక్క వంచుతుంది. భయపడుతుంది. అలాగే జరిగిందిక్కడా.

  అయితే ఇక్కడ ఒక మోసం జరిగిపోయింది. దుండగాన్ని శిక్షించాలి శాసకుడు. రక్షించరాదు. రక్షిస్తే అది అలాగే దాగి ఉండి ఎప్పుడో సమయం చూచి మరలా చెలరేగుతుంది. అప్పుడది మొదటికే మోసం తెచ్చే ప్రమాదముంది. పరీక్షిత్తు చేసిన తెలివితక్కువ అదే ఇప్పుడు. శరణాగత రక్షణమనే నెపంతో వాణ్ణి ఉపేక్షించాడు. పైగా వాడి కల్లబొల్లి ఏడుపులకు కరగిపోయి ప్రాణివధ స్త్రీ ద్యూత పానాదులు అసత్యమద కామాదులూ - ఇలాటి ప్రదేశాలలో యథేచ్ఛగా విహరించటానికి వాడి కనుమతి ఇస్తాడు. పైగా ఇలా తన మనసులో అనుకొంటూ ఇంటికి వెళ్లుతాడు.

చేసిన గాని పాపములు చెందవు చేయదలంచి నంతటన్ చేసెద నన్న మాత్రమున జెందు గదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచు నృప ముఖ్యుడు కాచె కలిన్ – మరందము ల్లాసము తోడ గ్రోలి విరులం దెగ జూడని తే టికైవడిన్

  కలికాలంలో మానవులకొక గొప్ప సలీసున్నదట. పాపమనేది చేస్తానని మనసులో అనుకొన్న మాత్రాన ప్రమాదం లేదు. చేస్తేనే అది ఫలితమిచ్చేది. పోతే పుణ్యమనేది అలా కాదు. అది చేయనక్కరలేదు. చేస్తామని ఊరక మనసులో ఒక సంకల్పం కలిగితే చాలు. తగిన ఫలితమిస్తుంది. అంచేత మనకు ఇప్పుడు వచ్చిన మేసమేముంది. ప్రమత్తులైన అధీరుల విషయంలో నైతే కలిపొంచి ఉండి సాధిస్తాడు గాని నాబోటి అప్రమత్తులూ ధీరులూ అయిన వారి కేమి బాధ అని బరవసా పడతాడు.

  ఈ బరవసాయే మొత్తానికతని ప్రాణం తీసింది. కొన్నాళ్ల తరువాత మృగయా వ్యాసంగంతో అరణ్యానికి వెళ్లుతాడు పరీక్షిత్తు. నానావిధ మృగ సంతతులను వధించి తీవ్రమైన దాహమేర్పడి జలం కోసమని శమీక మహర్షిని జలమిమ్మని ప్రార్థిస్తాడు

Page 73

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు