సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
మరి ఇప్పుడా శూద్ర రాజ ముద్రితుడైన చండాలుడా రెండింటినీ తన్నాడంటే వాడెవడో గాదు. వాడే కలి పురుషుడు. కలికాలమే పురుషరూపంలో ప్రత్యక్షమయింది. వాడు కూడా శూద్రుడు. శూద్రుడంటే శూద్ర స్వభావుడు. ఏమిటి శూద్రుడి స్వభావం. ఏకజాతిత్వం. ఒకే ఒక జన్మ గలవాడు శూద్రుడు. ఒకే జన్మ అంటే కేవల భౌతిక జన్మ. అది పశుపక్ష్యాదులకూ మానవుడికీ సాధారణమైనది. వైజ్ఞానికమైన మరొక జన్మ ఎత్తితేనే మనం ద్విజులమనిపించుకొనేది. అంతదాకా అందరమూ శూద్రులమే. అంటే సంస్కార శూన్యులమే. కేవలమూ మృగాలలాగా కామ క్రోధాధి వాసనలతో తామస వృత్తితోనే జీవిస్తుంటాము. ఇదే శూద్ర అనే మాటకర్థం. ఇలాంటి శూద్రతత్త్వం కలితో ఆరంభమయింది మనకు. కనుకనే కలిశూద్ర రాజ లక్షణాలతో బయలుదేరి వచ్చాడు. గో వృషభాలను రెంటినీ తన్నాడు. అందులోనూ మొదట వృషభాన్నీ ఆ మీదట గోవునూ తన్నాడు వాడు. అంటే ఏమని అర్థం. మొదట ధర్మం దెబ్బ తింటేనే భూమి దెబ్బ తింటుంది. ఫలించకుండా పోతుంది. ధర్మం కాపాడుతున్నంత వరకూ ఏ ఉపద్రవమూ రాబోదు. కనుక ధర్మాన్ని కూలదోసింది మొదట ఈ కలికాలం. ఆ తరువాత భూమికే ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ధర్మం వ్యక్తి ధర్మమే గాదు జాతి ధర్మమే గాదు. లోకధర్మమే గాదు. విశ్వ ధర్మమని Cosmic Law చెప్పినా చెప్పవచ్చు. విశ్వమంతా ఒక సూత్రం మీద నడుస్తూంది. అందులో మనముండే ఈ భూమండలం సముద్రంలో ఒక బిందువు. “సూత్రే మణి గణా ఇవ” అన్నట్టు అన్నీ ఆ సూత్రంలో పూసలు. ఆ ధర్మ సూత్రం తెగిందో ఇవన్నీ పూసలలాగా ఎక్కడివక్కడ చెల్లాచెదరు కావలసిందే. అలాంటి వైపరీత్యమే ఇప్పుడు మన మీ కాలంలో చూస్తున్నది. అనుభవిస్తున్నది.
ఇలాంటి దశే దృష్టి గోచరమయింది పరీక్షిత్తుకు. పరీక్షిత్తు గనుకనే అతడు నేటి మానవుడి లాగా ఊరక కూచోలేదు. మనకెందుకు లెమ్మని ఉపేక్షించలేదు. పైగా అతడు దేశమేలే రాజు. అధార్మికుడైన రాజు దుండగం చేస్తుంటే ధార్మికుడైన ప్రభువుపేక్షించరాదు. అది మహాపాపం. అది ఎప్పటికైనా శాపమై పరిణమిస్తుంది. ఈనాటి ప్రపంచంలోని పాలకవర్గాలకు కూడా ఇది ఒక పెద్ద హెచ్చరిక. అది కంట పడగానే పరీక్షిత్తు సహించలేకపోయాడు. తన కాలంలోనే తన రాజ్యంలోనే ఇంత అన్యాయమూ - అందులోనూ నోరు లేని జీవాలమీద ఇంతటి దారుణమా
Page 72