సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
కల్పనల పరంపరలో ఇది ఒకటి. ఎంతో అభిప్రాయమిమిడి ఉంది ఈ కల్పనలో. భూమికి ధాత్రి అనీ భూత ధాత్రి అనీ పేరు. మనబోటి ప్రాణికోటినంతా ధరిస్తున్నదిది. భరిస్తున్నది. జరాయుజాండ జాదికమైన చతుర్విధ భూత జాతమూ దీని చలువతోనే బ్రతుకుతున్నది. ఇది ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండి మనకు కావలసిన వన్నీ ఫలిస్తూంటేనే మనకు బ్రతుకు లేకుంటే మన బ్రతుకు బండలే. అయితే అది ఎప్పుడు ఫలిస్తుందీభూమి. ధర్మం నాలుగు పాదాలతో నడచినప్పుడే. అది ఎప్పుడు కుంటుపడిందో అప్పుడిది నిష్ఫలం. ఏ ప్రాణీ సుఖ నివాసానికి నోచుకోలేదు. కనుక ఈ భూమండలం ఎప్పుడూ కల కల లాడుతూ మనబోటి సమస్త ప్రాణులకూ వాసయోగ్యం కావాలంటే ప్రాణులందరూ తన్మూల కారణమైన ధర్మాన్ని ఎవరికి వారు పాటించి తీరాలి. ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం కాపాడితే అది మనలను కాపాడుతుంది. మనం కాపాడటం దాన్ని యథావిధిగా ఆచరించటం. అది కాపాడటమంటే జీవితం ఎలాటి ఒడుదుడుకులు లేకుండా సుఖంగా సాగటం.
ఈ భావాన్నే ప్రతీయమానం చేస్తున్నదీ సన్నివేశం. ధర్మానికీ ధరణికీ ఉండే సంబంధం ఒక వృషభానికీ గోవుకూ ఉండే సంబంధం లాంటిది. గో వృషభాలకుండే సంబంధ మేమిటో మనకు తెలుసు. వృషభ సాంగత్యం లేనిదే గోవు ఫలించదు. సంతతి కాస్కారం లేదు సరికదా పాలు పెరుగు నేయి ఇలాటి భోజ్య పదార్థాలు కూడా మనకు దుర్లభమే. అది ఉంటే ఈ సమస్త ఫలాలకూ నోచుకొంటాము మనం. అలాగే ప్రస్తుత మీ భూమండలం కూడా ధర్మాన్ని ఎడబాయనంత వరకూ యథాకాలంగా వర్షాలు కురిసి రసౌషధి వర్గాలు ఫలించి మన జీవితాలిందులో సుఖంగా కొనసాగుతాయి. మన సంతతి కూడా అవిచ్ఛిన్నంగా సాగుతూ పోతుంది. వృషభమని పేరు పెట్టటంలో వర్షించే స్వభావమున్నదని కూడా అర్థమవుతుంది. వర్షించేదేదో అది వృషభం. వృషభం వర్షిస్తేనే గోవు గర్భాన్ని ధరిస్తుంది. ప్రసవిస్తుంది. ధర్మం కూడా సక్రమంగా పాలిస్తే అది భూమి మీద మన సుఖ నివాసానికి కావలసిన సమస్తమూ వర్షిస్తుంది. మన కోరికలూ ఫలిస్తాయి. లేకపోతే ఒక గొడ్డు టావులాగా అయిపోయి ఈ ధాత్రి మన పాలిటికి సకలానర్థ దాత్రిగా మారుతుంది. తరువాత వేనుడి చరిత్రలో వస్తుందిదే విషయం. భూ ధర్మాలకుండే అవినాభావాన్నే చాటుతున్నది గోవృషభాల అవినాభావం.
Page 71