#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

రానంతవరకూ మోక్షం లేదు. కనుకనే అలాంటి నిర్గుణ తత్త్వోపదేశం చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదించటానికి జీవన్ముక్తుడైన శుకుడే కావలసి వచ్చింది. శుకుడికి బ్రహ్మరాతుడని మరొక నామధేయముంది. పరీక్షిత్తు విష్ణురాతుడైతే అతడు బ్రహ్మరాతుడు. ఒకటి సగుణ భక్తికీ మరొకటి నిర్గుణ జ్ఞానానికీ సంకేతాలు. సగుణ భక్తుడింకా నిర్గుణ స్థితికి రాలేదు గనుక వాడు శిష్యుడు. నిర్గుణుడా స్థితినందుకొన్నాడు గనుక గురువు. గురువిక్కడ బ్రహ్మరాతుడయిన శుకుడైతే శిష్యుడు విష్ణురాతుడైన పరీక్షిత్తు కావటంలో ఇదీ అంతరార్థం. సగుణస్థితిలో ఇంకా పరీక్షిత్తే మానవుడు. అంటే పరీక్షించటం లేదా అన్వేషించే స్వభావమింకా పూర్తి కాలేదని భావం. అదే గురూప దేశం ద్వారా నిర్గుణ తత్త్వాన్ని ఆకళించుకొంటే ముక్తుడయి గురువులాగా తానూ బ్రహ్మరాతుడే అవుతాడు. శుకుడే అవుతాడు.

  అసలీ పరీక్షిత్తు కథ ఏదో గాదు. మనకథే. మనలో సాధకుడైన మానవుడి కథ. మనకూ మాతృగర్భంలో ఉండగానే భగవద్దర్శనమయి ఉంటుంది. సందేహం లేదు. ఉత్తమాధికారులమైతే ఆ సంస్కారం పుట్టిన తరువాత కూడా మనల నంటిపట్టుకొని వర్తిస్తుంది. ఇహంలో బ్రతుకుతున్నా పరిచింతన వదలకుండా బ్రతుకు సాగిస్తాము. ధర్మ మార్గంలో మనం నడుస్తూ మనతో సాంగత్యమున్న వారంతా అలాగే నడవాలని అభిలషిస్తాము. పరీక్షిత్తు జీవిత మిదే. తండ్రిలాగా అభిమన్యుడు కాదతడు. పరీక్షిత్తు. దేహా ద్యభిమానమున్న వాడెవడో వాడభిమన్యుడు. అంటే పామరంగా బ్రతికే మానవుడు. వాడెప్పుడూ భగవత్తత్త్వానికి దూరుడే. అది లేని పరీక్షా శీలుడే భగవదను గ్రహానికి పాత్రుడవుతాడు. ఆసంస్కారంతోనే జన్మిస్తాడు. జీవిస్తాడు. ధర్మ మార్గ పరిపాలనమే అతడి ధ్యేయం.

  అప్పటికి ద్వాపరయుగం పోయింది. కలియుగం ప్రారంభమయింది. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినా డా దినమున నశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్. కృష్ణ నిర్యాణంతోనే కలి ప్రారంభం. సత్య శౌచ దయాది దైవగుణాలు కూడా ఆయనతోనే అస్తమించాయి. అంటే దైవ సంపదకు దూరమైన కాలమే కలియుగమని అర్థం. అసలా మాటకు వస్తే ఈ యుగాలు కూడా ఏవో కావు ఎక్కడో లేవు. కాలానుగుణంగా ఏర్పడేవి కావవి భావానుగుణంగా నని తోస్తుంది నాకు. యుగధర్మాలు నాలుగని పరిగణించారు

Page 68

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు