సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
వారి కంతః కరణాలు ఎలాగూ శుద్ధి అయి ఉన్నాయి. శుద్ధసత్త్వులు గనుకనే “జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్త్వాః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః" అన్నట్టు నిష్కల బ్రహ్మాత్మ భావంలో పరినిష్ఠితులై ఉన్న జీవన్ముక్తులు వారు. అయినా “చేయుచుందురు హరి గుణ చింతనములు మానసంబులనే ప్రొద్దు.” ఎందుకని. బ్రహ్మతత్త్వం తెలియనివారా. కాదు. “అరసి నిర్గుణ బ్రహ్మంబు నాశ్రయించి విధి నిషేధ నివృత్త సద్విమల మతులు" వారు. తమకు నిర్గుణమే తత్త్వమని తెలిసినా ముముక్షువులైన లోకులకు లేదా పరిపాకం. వారింకా సగుణమే తత్త్వమని భ్రాంతి పడుతుంటారు. వారి నా భ్రాంతి నుంచి తొలగించి క్రమంగా నిర్గుణ తత్త్వాన్ని అందుకొనేటట్లు చేయాలి. కనుక తమ స్థాయి నుంచి కొంత క్రిందికి దిగి వచ్చి మొదట భగవద్గుణ చేష్టాదులు వర్ణిస్తూ తద్వారా వారికి ప్రరోచన కలిగించి క్రమంగా వీటి కధిష్ఠానమైన ఆ మూలతత్త్వానికి విభూతే ఇది - దాని కనతి రిక్తమే ననిఏకైకమైన నిర్గుణాత్మ స్వరూపాన్ని నిరూపించాలి చివరకు. ఇందుకోసమే ఈ గుణ సంకీర్తనం. సరిగా శుకపరీక్షిద్వ్యహారంలో మనకు కనిపించే రహస్యమిదే. పరీక్షిత్తు కోరిందసలు మోక్షం తప్ప మరేదీ గాదు. అందుకోసమే అతడు ప్రాయోపవేశం చేసింది. కాని విష్ణుభక్తుడతడు. విష్ణు రాతుడని అతని పేరే వెల్లడి చేస్తున్నదా విషయం. విష్ణురాతుడంటే విష్ణు ప్రాప్తుడని అర్ధం. శంఖ చక్రగదాధారి అయిన భగవంతుని సగుణ రూపాన్నే దర్శించాడతడు. అదీ ఎప్పుడో గాదు. తల్లి గర్భంలో పిండరూపంగా ఉన్ననాడే. అశ్వత్థామ కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది ఉత్తర గర్భంలో ప్రవేశించింది. ఒక్క క్షణకాల మటూ ఇటూ అయితే అది ఆ శిశువును నామరూపాలు లేకుండా భస్మం చేసిపోయేది. ఇంతలోనే కృష్ణభగవానుడది గ్రహించి వెంటనే సూక్ష్మరూపంతో ఆవిడ గర్భంలో ప్రవేశించి గర్భస్థుడైన శిశువుకా అస్త్ర జ్వాలలు సోకకుండా గదా దండాన్ని గిరగిర త్రిప్పుతూ దాన్ని నిర్మూలించి కాపాడుతాడు. అతడెవరా ఈ మహాత్ముడని చూచే లోపల అదృశ్యుడవుతాడు. ఆ తత్త్వమేమిటా అని పరీక్ష చేశాడు గనుకనే ఆ శిశువుకు తరువాత పరీక్షిత్తని పేరు సార్థకమయింది. విష్ణురక్షితుడు కాబట్టి విష్ణురాతుడని కూడా పేరు వచ్చింది. అయితే సగుణరూపమే దర్శించాడు గనుక అదే స్మరణకు వస్తున్నది గాని ఆయనకు నిర్గుణమై సర్వవ్యాపకమై సర్వాత్మకమైన తత్త్వమేదో అది అనుభవానికి రావటం లేదు. అది
Page 67