#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

బట్టి జిజ్ఞాసువులైన శిష్యులే గురువులను వెతుకుకొంటూ వెళ్లవలసినట్టున్నా ఒకప్పుడు జిజ్ఞాస మరీ తీవ్రంగా ఉండి దానికితోడు ముముక్ష గూడా ప్రబలంగా ఉంటే అలాటి యోగ్యులైన శిష్యులవద్దకు సద్గురువులు స్వయంగా రావటం కూడా కద్దు. దానికి ఉదాహరణమే శుకుని రాక.

  మరి పరిపూర్ణుడయిన ఆ మహర్షి కేవలమూ బ్రహ్మభూతుడు గదా. అలాటి బ్రహ్మిష్ఠుడికి మరలా భగవద్గుణ కీర్తన చేయవలసిన ఆవశ్యకత ఏమిటని కూడా ఒకప్రశ్నే. దీనికి సమాధానం భగవానుడే చెప్పాడు. “నాన వాప్తమవాప్తవ్యమ్ వర్త ఏవచ కర్మణి" నేను క్రొత్తగా పొందవలసిందేదీ లేదు. అయినా కర్మ చేస్తూనే ఉంటాను అని. నిత్య ముక్తుడైన పరమాత్మే చేస్తున్నప్పుడిక ముక్తులైన ఆచార్య పురుషుల మాట చెప్పేదేముంది. వీరంతా జీవన్ముక్తులు కాబట్టి స్వప్రయోజన మంటూ లేకపోయినా ముముక్షు జనోద్దరణ కోసం భగవద్గుణ కీర్తన చేయటం దూషణం కాదు. మీదు మిక్కిలి భూషణమే.

ధీరులు నిరపేక్షులు నా త్మారాములు నైన మునులు హరి భజనము నిష్కారణమ చేయుచుందురు

ఆత్మారాములైనా హరి భజన చేయవచ్చు. అయితే వారు చేసే ఆ భజన నిష్కారణం. అంటే దానివల్ల వారు సాధించే ఫలమేదీ లేదు. ఫలమనేది ముక్తే గదా. అది ఎప్పుడో పొందారు వారు. మరి ఇక చేయటానికి కారణమేమి, తన కోసమని కాదు. ముముక్షువులైన వారి నుద్ధరించటం కోసం. ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మమేమంటే ముముక్షువులు, ముక్తులూ ఇరు తెగలవారూ భజిస్తుంటారా భగవత్తత్త్వాన్ని. ఇందులో ముముక్షువు లొకందుకైతే ముక్తులు మరి ఒకందుకు. రెంటికీ రెండు మాటలు చెప్పింది భాగవతం.

గురు మతులు తపసు లంతః కరణం బులు శుద్ధి సేయ ఘనత తర భక్తిన్ హరియందు సమర్పింతురు

  ముముక్షువుల నుద్దేశించి చెప్పిన మాట ఇది. రజస్తమో గుణ సంపర్కంతో మలీమసమైన మానసాన్ని నిర్మలం చేసుకోటానికే ముముక్షువులు భజించటం. పోతే ముక్తులు దేనికి భజించటమంటే చెప్పిన మాట. “ధీరులు నిరపేక్షులు” అనే మాట.

Page 66

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు