#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

  ఇలాంటి వాడే గురుస్థానంలో ఉండదగినవాడెప్పటికైనా. కనుకనే ఆయనే గురువయ్యాడు పరీక్షిత్తుకు. నారదుడు కాలేదు. వ్యాసుడు కాలేదు. వ్యాసుడాయనకు తండ్రి అయి కూడా సకల విద్యా పారంగతుడయి కూడా ఆచార్య స్థానమలంకరించ లేకపోయాడు. నారదుడా వ్యాసునికి భాగవత రచన చేయమని ప్రోత్సహించిన మహాభాగవతుడూ నిరంతర హరినామ సంకీర్తన పరాయణుడూ మహాజ్ఞాన సంపన్నుడూ అయి కూడా అతడూ చేయలేకపోయాడా పని. వీరంతా పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేస్తుంటే చుట్టూ పరివేష్టించి ఉన్నవారే. మోక్షమార్గం నాకుపదేశించమని ఆయన ప్రార్థించినా బదులు మాటాడక మౌనంగా కూచున్న వారే. మరి ఇంతవారై కూడా ఎందుకలా బెల్లం కొట్టిన రాళ్లలాగా ఊరకున్నారని మన మాశ్చర్యపడవచ్చు. కేవల శాస్త్రపాండిత్యమెంత ఉన్నా వైరాగ్య భావం లేనంత వరకూ బ్రహ్మానుభవం పరిపూర్ణం కాదనేందుకు వ్యాసుడి మౌనం నిదర్శనం. అలాగే జ్ఞానమే కాక వైరాగ్యం కూడా అలవడినా ఇంకా త్రిలోకాలూ సంచరిస్తూ త్రిగుణాత్మకమైన సృష్టితో ఇంకా లావాదేవీ పెట్టుకొంటూ మధ్య మధ్య విక్షేపానికి చాపల్యానికి గురి అయినా లాభం లేదని చెప్పేందుకు నారదుడి తూస్జీం భావం మనకు తార్కాణం.

  పోతే ఇలాంటి లొసగులేవీ లేని పరిపూర్ణ జ్ఞానవైరాగ్య సంపన్నుడు గనుకనే శుక మహర్షి ఒక్కడే ఆచార్య పీఠమెక్కగలిగాడు. మోక్ష విద్యోప దేశానికి అర్హుడనిపించుకొన్నాడు. అందుకే అందరితో పాటు వ్యాస నారదులు కూడా ఆయనను చూడగానే ప్రత్యుత్థానాదులు చేయవలసివచ్చింది. అయితే ఆత్మారాముడు గదా ఆయన. అలాంటి వాడికి మరలా లోకంతో సంగమెలా ఏర్పడిందని అడగవచ్చు. ఆత్మారాములన్న మాత్రాన లోక సంగ్రహ మసలే చేయరనుకోరాదు. ఆత్మారాములు లోకసంగ్రహపరులూ కావచ్చు. లోక సంగ్రహపరులాత్మా రాములూ కావచ్చు. అయితే వీరిలాగా వారెప్పుడూ లోకంతో సంబంధం పెట్టుకోరు. కాదాచిత్కమైనది వారి సంబంధం. అదీ ఆ పరమాత్మ ప్రేరణవల్లనో లేక వారి వల్ల శ్రవణం చేసి తరించే మహాభాగ్యం శ్రోతల కుండటం వల్లనో, దేనివల్లనైనా కావచ్చు. అదే మహాత్ముల కలాంటి బుద్ధి పుట్టించి వారిచేతనే అలాంటి మహోపదేశం చేయిస్తుంది. సాధారణంగా “ఉత్తిష్ఠత జాగ్రత - ప్రాప్యవరాన్ - నిబోధత” అనే శాస్త్ర ప్రామాణ్యాన్ని

Page 65

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు