సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
ఇందుకే మనమీ కథలన్నీ అర్థవాదాలని గ్రహించవలసింది. నారదుడొకప్పుడు దీనుడు కాలేదు. మరొకప్పుడు ధీరుడు కాలేదు. నారదుడి కథ గాదిది. మనబోటి లోకుల కథ. నారదుడి మీద నెపం పెట్టి శాస్త్రం మన విషయమే మనకు భంగ్యంతరంగా బోధిస్తున్నది. మనలో నారదుడిలాగా సర్వశాస్త్రాలూ, సకల కళలూ సాంగోపాంగంగా అభ్యసించిన పెద్దలుంటారు. లోకంలో ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులార్జించి ప్రతివాది భయంకరులని ప్రసిద్ధులయి ఉంటారు. అయితే ఎంత పాండిత్యమున్నా “నిత్య రూప నీ యెదుట నెవరి పాండిత్యమేమి నడచురా” అని త్యాగయ్య చెప్పినట్టు అదంతా అసలు విద్య తెలియనంతవరకూ వ్యర్థమే. “యేన విజ్ఞాతేన సర్వమిదం విజ్ఞాతం భవతి" అనే విద్య అది. అది లభిస్తే గాని శాంతికీ, సౌఖ్యానికీ నోచుకోలేడు మానవుడు. నోచుకోని వాడు ఎంత పండితుడైనా పామరుడే. నిజమైన పాండిత్య మాత్మజ్ఞాన సంపత్తి. అలాటి వాడి సాంగత్యంలోనే ఇనుము బంగారమయినట్టు మన పాండిత్యం పాండిత్యమవుతుంది. అంతవరకూ విషాదమే మానవుడికి. అది నారదుడి కెలాగో వ్యాసుడికీ అలాగే. వ్యాసుడంటే అన్నీ తెలిసిన మహామేధావి. వేద పదార్థ జాల విజ్ఞాతే కాకుండా బ్రహ్మతత్త్వ నిర్ణేత కూడా. అంటే బ్రహ్మాండమైన శాస్త్ర పాండిత్యముందే గాని ఆయన కనుభవం లేదు శాస్త్రజ్ఞానం కేవలం జ్ఞానమే గాని విజ్ఞానం కాదు. విజ్ఞానమంటే ఆత్మానుభవం. అందుకే శ్రోత్రియం బ్రహ్మ నిష్ఠమన్న దుపనిషత్తు. శ్రుతి జ్ఞానమే కాదు. శ్రుత్యర్థ భూత పరమాత్మ స్వరూప నిష్ఠ ఉండాలి. సర్వకాల సర్వావస్థలలో మనోవాక్కాయాలతో ఏది ఎప్పుడు జరుగుతున్నా అదంతా బ్రహ్మాకారంగానే ఆత్మాకారంగానే దర్శిస్తూ, అనుభవిస్తూ ఉండాలి. ఇది ఆత్మేతరమంతా కేవల మిథ్యాభూతమని విరాగభావంతో చూస్తేనే గాని అలవడదు. అప్పటికి జ్ఞానానికి కాకపోయినా జ్ఞాన నిష్ఠకు వైరాగ్యమనేది నాంతరీయక మని Inevitable చెప్పినట్లయింది.
ఇందులో జ్ఞానముందేగాని వ్యాసుడికి వైరాగ్యం లేదు. నారదుడికీ లేదు మొదట. అందులో పరిపాకాన్ని గడించటాని కాయనకు మూడు జన్మలు పట్టింది. అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిమ్. ఎవడే గాని ఒక్కసారిగా జీవిత పరమార్థాన్ని గంతువేసి అందుకోలేడు. అనేక జన్మల అభ్యాస ఫలమది. అది నారదుడి వృత్తాంతం ద్వారా గ్రహించవలసిన సత్యం. వ్యాసుడు కూడా అలాగే ఎంత జ్ఞానవంతుడైనా
Page 63