సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
గదా మరి ఏమిటిలా కాతరుకైవడి వగవు చెందావని నవ్వుతూ మందలిస్తాడు. దానికి వ్యాసమహర్షి సమాధానమిస్తూ అయ్యా నీవు మహా ప్రబోధమున తుదముట్టిన వాడవు. నీకెరుగరాని ధర్మము లేదు. నాకేర్పడిన ఈ కొఱత ఎట్టిదో నీవే కనిపెట్టమని అడుగుతాడు. అందుకు నారదుడిలా అంటాడు.
అంచితమైన ధర్మచయమంతయు జెప్పితి వందులోన నిం చించుక గాని విష్ణుకథ లేర్పడ జెప్పవు - ధర్మముల్ ప్రవం చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నిన గాక - నీకు నీ కొంచెము వచ్చు టెల్ల హరి గోరి నుతిం పమి
మరేమీ గాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హరిగుణ సంకీర్తన రత్నాకరమైన భాగవతాన్ని రచించి కృతకృత్యుడవు కమ్మని హెచ్చరిస్తాడు. ఇది కేవలం సిద్ధాంతంగా గాక తన జీవితాన్నే దృష్టాంతంగా అతని కేకరువు పెడతాడు. మూడు జన్మల తన భాగవత వృత్తాంతాన్ని బయట పెడతాడు. దానితో తన దీర్ఘ విషాదానికి స్వస్తి చెప్పి వ్యాస భగవానుడు భాగవత నిర్మాణం చేసి మనః ప్రసాదాన్ని పొందుతాడు. ఏమిటీ వృత్తాంతంలోని అంతరార్థం. వ్యాసుని అంతవాడు విషాదం పాలు కావటమేమిటి. నారదుడు వచ్చి ఉపదేశిస్తే గాని తేరుకోలేక పోవటమేమిటి. మరి నారదుడంత స్థితప్రజ్ఞుడే అయితే ద్వంద్వాతీతుడే అయితే ఆయన విషాదమెలా అనుభవించాడు. ఒకప్పుడీ నారదుడే విషణ్ణుడై సనత్కుమారుడి దగ్గరికి పరుగెత్తి వెళ్లుతాడు. ఏమయ్యా ఎందుకు బాధపడుతున్నావని అడిగితే అయ్యా “సోహమ్ మంత్రవిదే వాస్మి నాత్మ విత్" స్వామీ నాకు విద్యలన్నీ తెలుసునే గాని ఆత్మ విద్య మాత్రం తెలియదని మొరపెడతాడు. ఏమా ఒక్క విద్య తెలియకపోతే నని అడిగితే "శ్రుతమ్ హ్యేవ మయా భగవదృశేభ్యః తరతి శోకమాత్మ విదితి తన్మా శోకస్య పారమ్ తారయతు భగవా నితి" తమ బోటి పెద్దలు చెప్పగా విన్నాను ఆత్మ వేత్త అయితేనే గాని సంసార దుఃఖాన్ని దాటిపోలేడని. అంచేత ఎలాగైనా తామనుగ్రహించి ఆత్మవిద్య ప్రదానం చేసి నన్ను తరింపజేయమని ప్రాధేయపడతాడు. ఇది ఛాందోగ్యోపనిషత్తులో కథ. మరి అక్కడ అంతదీనంగా వర్ణించబడ్డ నారదుడిక్కడ ఇంతటి ధీరుడెలా కాగలిగాడు.
Page 62