#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

గొప్ప పౌరాణికుడు – బహుశ్రుతుడు, బ్రహ్మవేత్త అని తెలుసు వారికి. ఆయన వల్ల భగవత్కథా శ్రవణం చేసి ధన్యులమవుదామని అభిలషించారు వారు. భాగవత శ్రవణం చేయటంలో వారి ఏకైక లక్ష్యం సంసార తరణమే. మరేదీ గాదు. కలికాల మానవులకది అసాధ్యమని వారికి తెలుసు. అది వారి మాటలలోనే తేట పడుతుంది మనకు.

అలసులు మందబుద్ధి బలు లల్పతరాయువు లుగ్రరోగ సం కలితులు మంద భాగ్యులు - సుకర్మము లెవ్వియు చేయ జాలరీ కలియుగ మందు మానవులు - కావున నెయ్యది సౌఖ్య హేతువై యలవడు - నేమిటం గలుగు నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే

  ఇదీ వారికి పట్టుకొన్న సమస్య. కలియుగ మానవులంతా అన్ని విధాలా అదృష్టహీనులు అసమర్థులు. జీవితంలో శాంతికీ, సౌఖ్యానికీ రెంటికీ దూరమయి సంసార యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి వారికీ సాంసారికమైన సకల క్లేశాల నుంచీ విముక్తి ఎలా లభిస్తుందని వారి ప్రశ్న. దీనికి జవాబు సూతుని భాగవత ప్రవచనం.

  అసలీ సూతుడెవరు. శౌనకాదులెవరు. నైమిశారణ్యమేమిటి. అక్కడ వారంత దీర్ఘకాలం యాగం చేయటమేమిటి. నేమి ఎక్కడ శీర్ణమయిందో అది నేమిశం. నేమిశమే నైమిశం. నేమి అంటే చక్రమని అర్థం. మానవుడి మనస్సే ఆ చక్రం. మనోమయమనే వర్ణించిందా చక్రాన్ని భాగవతం. చక్రంలాగా నిరంతరమూ భ్రమించే స్వభావమున్నది గనుక మనస్సును చక్రంతో పోల్చారు. అది మొదట ఏ దివ్య సీమలలోనో విహరిస్తుండేది. అది కృతయుగం. కాలక్రమేణ దానికి పతనమేర్పడింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబన్నట్లు అంతకంత కది దొర్లుతూ వచ్చి ఈ కర్మ భూమిని స్పృశించేసరి కక్కడ శీర్ణమయింది. అంటే తన పూర్వ వైభవాన్ని కోలుపోయి స్తబ్ధంగా నిలిచిపోయిందని భావం. అదే ఈ కర్మ భూమి. సంసారం. నైమిశమంటే సంసారమే. ఇది ఒక అరణ్యం మన పాలిటికి. దిక్కు తెలియక తిరుగుతున్నాము దీనిలో. మనకు ఇష్టమున్నా లేకున్నా ఏదో ఒక కర్మ ననుక్షణమూ ఆచరిస్తూ పోవలసిందే. తప్పదు.

Page 59

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు