భాగవత ప్రాశస్త్యము
భాగవతము
విబుధులంటే. అలాంటి ఆచార్య పురుషుల ఉపదేశం మూలంగా గ్రహించాలి ఎవరైనా. ఎలా గ్రహించాలది. విన్నంత. కన్నంత. తెలియవచ్చినంత. మూడు భూమికలివి. శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య అని శాస్త్ర వాక్యం. మొదట శ్రవణం చేయాలి. అదే వినటం. దానితో గ్రంథ తాత్పర్యమేమిటో దాని జ్ఞానముదయించి అజ్ఞానమనే తమస్సు విరిసిపోతుంది. పోతే తరువాత మననం చేయాలి. ఇదే కనటం. దీనితో సాధకుడికి కలిగే అసంఖ్యాకమైన సంశయాలన్నీ పటాపంచలయి నిశ్చయ జ్ఞానమేర్పడుతుంది. ఆ పిమ్మట మూడవది నిది ధ్యాసన. అదే తెలిసి రావటం. దీనివల్ల ఆత్మకు విజాతీయమైన చరాచర పదార్థాలన్నీ వట్టివే సుమా సర్వత్రా సర్వదా ఉన్న దొకే ఒక పరమాత్మ తత్త్వమని బాహ్యాభ్యంతర వ్యవహారంలో నిత్యమూ అదే మరేదీ లేదని తెలిసిపోతుంది.
ఇలాటి సిద్ధ పురుషులే నారద బాదరాయణ శుక శౌనకాదులు. తన్ముఖంగా వెలువడిందే ఈ భాగవత మహాపురాణం. వారి అడుగుజాడలలో పయనించి దాని సారాన్ని తామాస్వాదించి లోకానికి దాని మాధుర్యాన్ని పంచి పెట్టినవారు శ్రీధరాదులైన ఆచార్యులు. వారినందరినీ ఆకళించుకొని అతిలోకమైన ఆ భావాన్ని స్వానుభవానికి తెచ్చుకొని ఒక రసాయనంగా మనకు ప్రసాదించిన మహాపురుషుడు బమ్మెర పోతనామాత్యుడు. ఈ గురు పరంపర అంతా కీర్తించిన ఆ మహాపురాణ ప్రాశస్త్యమింతదని వర్ణించటానికి మనమెంత వారం. అయినా కొంతకు కొంత చవి చూడగలిగాము, చెప్పగలిగామంటే ఇది కూడా ఆ విబుధ జన వచో విభూతి సంపర్క ప్రభావమే. మరేదీ గాదు.
Page 57