భాగవత ప్రాశస్త్యము
భాగవతము
ప్రతి ఒక్కరూ దాన్ని భజించవలసిందే. శ్రేయమంటే ఆశ్రయించవలసింది లేదా భజించవలసిందని అర్థం. ఎవరా భజించవలసినవారు. సద్ద్విజులు. ద్విజమంటే పక్షి అనీ అర్థమే. ద్విజన్ములైన జ్ఞానులనీ అర్థమే. సత్తంటే ఆకాశమని కూడా అర్థం. ఆకాశచరములైన పక్షులు వృక్షాన్ని ఆశ్రయిస్తే ఈ భాగవత వృక్షాన్ని ఉత్తములైన జిజ్ఞాసువులూ, ముముక్షువులూ ఆశ్రయించవలసి ఉంది.
ఏవంవిధ విశేషణ విశిష్టులైన ఉత్తమాధికారులకు తప్ప ఎవరికంటే వారి కంతుపట్టేది కూడా కాదీ భాగవత తత్త్వమసలు. ఇంతకుముందే వర్ణించా మీ విషయం. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు. ఊరక చిలుక పలుకుగా పలుక వచ్చునే గాని దాని ఆంతర్యం తెలుసుకొని పలకాలంటే మాత్రమది సామాన్యం కాదు. చాలా అసాధ్యం. ఎవరికీ అసాధ్యం. శూలికైన తమ్మిచూలికైన - శివుడికీ బ్రహ్మకూ కూడా అసాధ్యమేనట. మరి వారిరువురికీ అసాధ్యమైతే పోతనకెలా సాధ్యమయింది. పోతనకు బోధించిన విబుధజనులకెలా సాధ్యమయింది. అంచేత అదిగాదు దాని అర్థం. శివుడంటే శివుడు కాదు. బ్రహ్మ అంటే బ్రహ్మా కాదు. వారిరువురికీ బదులుగా వారి గుణాలను తీసుకోవాలి మనమిక్కడ. రజస్తమో గుణాలకు ప్రతీకలే చతుర్ముఖ శివతత్త్వాలు. కాబట్టి వారిద్దరికీ బోధపడ లేదంటే ఆ దేవతలకనిగాదు. ఆ గుణాలు గల మానవులకని అర్థం. అంటే ఏమన్న మాట. రజస్తమో గుణ దూషితాంతః కరణుల కది ఏ మాత్రమూ గ్రహణ గోచరం కాదు. రజస్సు చిత్త విక్షేపానికీ - తమస్సు చిత్తావరణానికీ మూలం. అందులో విక్షేపం అనాత్మ జగత్తు మీదికి పరుగెడుతుంటే ఆవరణం ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడూ కప్పి పుచ్చుతుంటుంది. అలాంటప్పుడిక ఆ మనస్సుకు వికాసమేమిటి. వివేచన ఏమిటి. అవి లేకపోతే పరమార్థ స్ఫురణమేమిటి. కనుకనే ఈ మాట.
అయితే మరి ఎవరికి స్ఫురిస్తుందా పరమార్థం. చెప్పాము గదా ఉత్తమాధికారులకే నని, ఎవరు వారు. ఎవరు రజస్తమో దోషదూషితులు కారో వారు. అంటే శుద్ధ సత్త్వ గుణ సంపన్నులన్న మాట. సత్త్వా త్సంజాయతే జ్ఞానమన్నారు. సత్త్వం విశుద్ధమైతేనే పారమార్థికమైన జ్ఞానముదయించేది. వారే సాత్త్వతులైన భాగవతులు. వారినే మరొక భాషలో విబుధులని వ్యవహరిస్తారు. “బుధాభావ సమన్వితాః” అని విబుధ శబ్దానికింతకు ముందే అర్థం చెప్పుకొన్నాము. పరమార్థ జ్ఞాన సంపన్నులే
Page 56