ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
అయితే ఒక ప్రశ్న. శాస్త్ర ప్రమాణంతో మనం జ్ఞానాన్ని గడించ వలసిన అవసరమేమిటి. శాస్త్రం లేక పోయినా లోకమొకటి ఉంది గదా. అదే మనకు మార్గ దర్శకం. అలాగే మన బుద్ధి కూడా మనకు నిత్యం సన్నిహితంగానే ఉంది. దాని సహాయంతో ప్రతి ఒక్కటీ గ్రహించగలం. అనుభవించగలం. అలాంటప్పుడు గురుముఖంగానే జ్ఞానోపార్జన చేయాలనే నియమం దేనికి. గురువు కూడా ఒక ప్రజ్ఞావంతుడైతే కావచ్చు. తన ప్రజ్ఞ ననుసరించే అతడొక మార్గాన్ని చూపుతూ పోతాడు. అది ఒక్కటే మార్గమనుకోవటం దేనికి. మన బుద్ధి బలంతో ఇంకొక మార్గమన్వేషించి ఎందుకు పట్టుకోరాదు. అలాగే కదా బుద్ధికి ఒక వికాసమూ ప్రగతి శీలతా ఏర్పడగలవు- అని ప్రశ్న.
ఇది కేవలం ఒక అవిచార మూలకమైన ప్రసంగం. ఎందుకంటే లోకంలో సాధకు లందరూ ఒకటి కారు. అధికార తారతమ్యమెంతైనా ఉంటుంది. వారిలో ఉత్తమోత్తము లుంటారు. ఉత్తము లుంటారు. మధ్యము లుంటారు. అలాగే మందులూ ఉంటారు. నాలుగు విధాలైన అధికార ముంటుంది మానవులకు. వీరిలో మొదటి వారికి శాస్త్రంతోగాని గురువుతోగాని నిమిత్తం లేదు. జన్మాంతరగతమైన అభ్యాస పాటవంతో ఈ జన్మలో ప్రతిభావంతులుగానే జన్మిస్తారు. వారి ప్రతిభే వారికి గురువు చేసే పని చేయగలదు. నేనూ- నేను చూచే ఈ సమస్తమూ-బ్రహ్మమేననీ - ఆ బ్రహ్మమాత్మ స్వరూపమనీ- నిత్యమూ అనుసంధానం చేసుకొంటూ జీవ యాత్ర సాగిస్తుంటారు. మరి రెండవ వారు కొంత పాండిత్య మలవడిన బుద్ధిమంతులు. వారికీ గురు సహాయమంతగా అక్కర లేదు. శాస్త్రాన్నే గురువుగా భావించి
Page 88