ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
అయితే మరలా ఆవిడ మనదగ్గర కెలా వస్తుంది. వచ్చి మన చిత్త వృత్తు లంన్నింటినీ వ్యాపించి మన చిత్తాన్ని తన స్వరూపంలో ఎలా లయం చేస్తుందని ప్రశ్న. దానికి జవాబు చెబుతున్నారు శిష్టేష్టా అని. మూడు దోషాలూ నిర్మూలమైతే చాలు. దుష్టుడు శిష్టుడుగా మారిపోతాడు. అలాటి శిష్టుడికి ఇష్టమౌతుందా దేవి. ఏషణమంటే కోరటమనీ అన్వేషించటమనీ కూడా అర్థమే. తత్త్వాన్ని అన్వేషించి తన స్వరూపంగా భావించాలని సాధకుడు కోరుతాడు కాబట్టి రెండూ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకటి పొందాలని మొదట ఇచ్చ- తరువాత అన్వేషణ- అన్వేషించిన దానితో తాదాత్మ్యం చెందాలని మరలా ఇచ్ఛా- కలగటం సహజమే.
ఒక మధురమైన పదార్థాన్ని తినాలని మొదట ఇచ్చ ఏర్పడుతుంది. ఇచ్ఛ బలీయమైతే వెంటనే దాన్ని కొని తీసుకురావాలని ప్రయత్నిస్తాము. ఆ ప్రయత్నం బలీయమైతే అది తప్పకుండా లభిస్తుంది. ఆస్వాదిస్తాము. ఆప్యాయనం చెందుతాము. ఇక్కడ కూడా ఆ దేవత ఆత్మ రూపిణి అయి కూడా బహుకాలం నుంచి అది మనం విస్మరించాము. ఉన్నట్టుండి మరలా దాన్ని గ్రహించాలని ఇచ్ఛ ఏర్పడుతుంది. ఏర్పడిందో లేదో దాన్ని సాధించటానికి ప్రేరణ చేస్తుంది. ప్రేరణ బలమయ్యె కొద్దీ అన్వేషించి దాన్ని ఆత్మ స్వరూపంగా అనుభవించగలం. సందేహం లేదు. శిష్టుల చేత అన్వేషింపబడేదీ- వారికిష్టమైనదీ గనుక ఆ దేవి అయింది. అలాగే ళిష్టులంటే తనకిష్టం గనుక కూడా ఆవిడ శిష్టేష్ట అయిందని చెప్పినా చెప్పవచ్చు. శిష్టులావిడను కోరితే శిష్టుల నావిడ కోరుతుందని భావం. ప్రియోహి జ్ఞానినోత్యర్థ- మహం సచ మమ ప్రియః- అని గదా భగవానుడిచ్చిన హామీ.
Page 83