ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
13. దుష్ట దూరా
14. శిష్టేష్టా
ఆ విధంగా భావించలేని వారెవరో వారందరూ దుష్టులు. దుష్టులైన వారికా దేవి ఎప్పుడూ దూరంగానే ఉండిపోతుంది. ఎప్పటికీ గోచరం కాదు. వారు దుష్టులెలా అయ్యారని అడగవచ్చు. దోషాల చేత దూషితులైన వారు వారంతా. ఈ దోషాలు మూడు విధాలని పరిగణించారు శాస్త్రజ్ఞులు. వాటినే పాపాలని కూడా పేర్కొంటారు. అందులో మొదటిది అవిద్య. రెండవది కామం. మూడవది కర్మ. ఆత్మ జ్ఞానం లేకపోవటమే అవిద్య. దాని చేత ఆత్మే అనాత్మగా భాసిస్తుంటుంది. అవే పుత్ర కళత్రాదులు- ధన ధాన్యాదులు. భాసించే సరికి వాటిని సొంతం చేసుకోవా లనిపిస్తుంది. అది కామం. దానితో ఆ విషయాలను సాధించటం కోస మొక ప్రయత్న మేర్పడుతుంది. అది కర్మ. కర్మ వల్ల ఫలం. ఫలం వల్ల చివరకు అనుభవం. ఇంతకూ ఈ సంసారాని కంతటికీ హేతుభూత *మైనవీ మూడే. అవిద్యా కామ కర్మలు.
ఈ మూడు దోషాలు మన లెంతవర కంటి పట్టుకొంటాయో- అంత వరకూ మనమంతా దుష్టులమే. దుష్టులం గనుకనే ఆవిడ మనకు దూరమైపోయింది. యధార్థంలో పోలేదావిడ. మన కగోచరం కావటమే ఆ పోవటం. అందుకు కారణమీ దోష త్రయమే. ఇవి మూడూ మూడు తెరలై దేవీ స్వరూపానికీ మన బుద్ధులకూ నడుమ అడ్డుపడుతున్నాయి. దీని మూలంగానే ఆ తత్త్వం మనకు దూరమైంది. కనుకనే ఆ దేవతకు దుష్టదూరా అని పేరు రావటం.
Page 82