#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

  మరొకచిత్రమేమంటే ఈ మూడు నామాలలోనూ శ్రీ అనే అక్షరానికి ప్రక్కన మకారం చేర్చి చెప్పటం. తన్మూలంగా ఈ - నామాల నుచ్ఛరించేటపుడు శ్రీం శ్రీం అని మకారధ్వని చెవిలో పడుతున్నది. అది మనకు పంచదశీ విలక్షణమైన షోడశిని గుర్తుచేస్తున్నది. ఇది హయగ్రీవుడు బుద్ధి పూర్వకంగానే కల్పించినట్టు తోస్తున్నది. లేకుంటే రాష్ట్రా అనక మహారాజ్ఞి అనటం సింహాసనేశ్వరీ అనక శ్రీమత్ సింహాసనేశ్వరి అనటం జరిగి ఉండదు. మకార ధ్వని మనకు వినపడాలనే మూడింటిలోనూ శ్రీ ప్రక్కన మకారాన్ని ప్రయోగించాడాయన. శ్రీం అనేది షోడశీ రూపమైన మంత్రాక్షరం. అది బ్రహ్మ విద్యకు పర్యాయం. ఈ అక్షరం అక్షరమైన బ్రహ్మతత్త్వాన్నే మనకు సూచిస్తున్నదిక్కడ. యయా తదాక్షరమధిగమ్యతే అని ముండకోపనిషత్తు చెప్పిన పరవిద్య మనకీ మాటలో తేటపడుతున్నది. బ్రహ్మాకారమైన వృత్తినే ఈ శ్రీ శబ్దం సూచిస్తున్నది. అది కూడా ఒకసారి గాదు. శ్రీ శ్రీ శ్రీ అని మూడు మార్లు సూచిస్తున్నది. మనసా వచసా కర్మణా త్రికరణాలతోనూ ఆ బ్రహ్మ విద్యను పట్టుకోవాలని ఆశయం. అలా త్రికరణ శుద్దిగా పట్టుకొన్నప్పుడే త్రిగుణీకృతమైన ఫలాన్ని మనకందిస్తుంది. కనుకనే ఆదిలో ఈ అభిప్రాయాన్ని మూడు మార్లు ఎలా సూచించాడో అంతంలో కూడా అలాగే సూచించాడు హయ గ్రీవుడు. నామావళి చివర కూడా చూడండి మూడు మార్లు వస్తుంది ఈ శ్రీ శబ్దం. శ్రీ చక్ర రాజ నిలయా- శ్రీమత్రిపుర సుందరీ - శ్రీ శివా. ఈవిధంగా స్తోత్రానికి ఆద్యంతాలలో శ్రీ శబ్దాన్ని మూడు మార్లు ప్రయోగించటం ద్వారా శ్రీ విద్యకు బ్రహ్మ విద్యకు ఏ మాత్రమూ తేడా లేదని- బ్రహ్మ రూపమైన శివసాయుజ్యాన్ని అదే మసకు ముమ్మాటికీ ప్రసాదించే ఏకైకమైన ఆలంబమని మహర్షి మనకు భంగ్యంతరంగా చాటి చెబుతున్నాడు. శ్రీ విద్యకు గల ప్రాధాన్యాన్ని కూడా మనకు ధ్వనింపజేస్తున్నాడు.

Page 14

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు