ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
విధాలుగా వీటిని పరిగణించారు. అవే ఇక్కడ చెప్పుకొన్నా తప్పులేదు.
లోకంలో మానవులు కూడా నాలుగు విధాలే. కొందరు సుఖ పడేవారైతే కొంద రెప్పుడూ కష్టపడేవారు. కొందరు పుణ్యాత్ములైతే కొందరు పరమ కర్కోటకులు. మనమీ నలుగురితోనూ జీవితాంతమూ వ్యవహరించక తప్పదు. అలా వ్యవహరిస్తున్నప్పుడు ఆయా వాసనలు కూడా ఏర్పడక పోవు. కనుక అవి ఏర్పడకుండా పోవాలంటే సుఖితుల విషయంలో మైత్రిని- దుఃఖితులలో కరుణనూ- పుణ్యాత్ములలో ముదితనూ- దుర్జనులలో ఉపేక్షనూ అవలంబించటం మంచిది. అవి వరసగా మన ఈర్ష్యా కాఠిణ్య అసహన ద్వేష వాసనలను నిర్మూలిస్తూపోతాయి. దానితో అశుభవాసనలు క్రమంగా దూరమైపోయి మనస్సు- వాటికి మారుగా శుభవాసనలచేత వాసిత మయ్యే అవకాముంది.
అది పరిపాకానికి వస్తే అశుభ వాసనల లాగే మైత్రాదులైన శుభవాసనలకు కూడా సాధకుడు స్వస్తి చెప్ప వలసి ఉంటుంది. ఎందుకంటే అవి కూడా త్రిగుణాత్మకమే లౌకికమే. గుణాత్మకంగనుక గుణాతీతమైన ఈశ్వర తత్త్వాన్ని దర్శించనీయవు. అందులో నిలకడ చెందనీయవు. కనుక నిర్గుణమైన బ్రహ్మ వాసనతో ఈ శుభ వాసనలను కూడా త్రోసి పుచ్చ వలసి ఉంది. అయితే మొదటనే కాదు. మొదట కొంత కాలం శుభ వాసనల నభ్యసించి వాటి ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసుకొని ఆ తరువాత ఈశ్వర భావనతో వాటిని పరిహరించాలి. సత్త్వ శుద్ధా ధ్రువాస్మృతిః అని శాస్త్రమే బోధిస్తున్నది మనకీ విషయం. అంచేత సంశయించ బని లేదు. సంశయమెప్పుడూ అనభ్యాసులకే.
Page 109