నేను వచ్చి ఆ శిశుహంతలను పట్టి శిక్షిస్తానని అభయ మిస్తాడు. బలరామ కృష్ణాది యాదవ వీరుల వల్లనే కాని నీ వల్ల కాదంటా డావిప్రుడు. వారిని మించిన బలపరాక్రమ శాలినని భీకరాలు పలుకుతా డర్జునుడు. ఇష్టం లేక పోయినా సరేనని చెప్పి వెంట బెట్టుకొని వెళ్లుతాడు బ్రాహ్మణుడు. శత విధాల పోరి కూడా అర్జునుడు తన ప్రయత్నంలో విఫలు డవుతాడు. ఆ బ్రాహ్మణు డతణ్ణి పడదిట్టి మరలా శ్రీకృష్ణుడి దగ్గరకి పరుగెత్తి కొనిపోయి మొరపెడితే ఆయన శైబ్యసుగ్రీవ మేఘ పుష్ప వలాహ కాలనే గుణాలను పూన్చిన రథ మెక్కి అర్జునుడితో సహా బయలు దేరి సప్త సముద్రాలూ సప్తకుల పర్వతాలూ దాటి అన్ని దిక్కులూ గడచిపోయి చివరకు క్షీర సాగరంలో ప్రవేశించి మహాంధ తమ సాన్ని ఛేదించుకొంటూ పోగా పోగా శేషశాయి అయిన ఆదినారాయణుడు దర్శనమిస్తాడు. “న నంద ఆత్మాన మనంత మచ్యుతో-విష్ణుశ్చ తద్దర్శన జాతసాధ్వసః” తన ఆత్మ స్వరూపుడే అయిన ఆ నారాయణమూర్తికి నమస్కరిస్తాడు కృష్ణుడు. ఆయన మందస్మితం చేస్తూ నరనారాయణులైన మిమ్ము ఒకసారి చూడాలని ఇక్కడి మహామునులు కోరితే విప్రబాలకుల నపహరించ వలసి వచ్చింది. అంతే గాని మరేమీ కాదని చెబుతూ వారికా బిడ్డల నందరినీ ఇచ్చి వీడ్కొలుపుతాడు.
ఈ కథ ఒక్కటే చాలు మనకు శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడేనని చెప్పటానికి. మూల విరాట్టు దగ్గరికి మరలా పోయి రావటమనేది మరి ఏ అవతార చరిత్రలోనూ జరగ లేదు. రాముడు దేవేంద్రుని సందర్శనానికే నోచుకోలేక పోయాడు. మిగతా వారి సంగతి అసలు చెప్పనక్కరలేదు. ఒక్క కృష్ణావతారం లోనే ఇలాంటి మహిమలన్నీ. అందుకే తక్కిన అవతారాలన్నీ భగవదంశ లైతే ఇది భగవానుడే స్వయంగా. భగవచ్ఛబ్ధం కృష్ణుడికి మాత్రమే వర్తిస్తుంది. భగవద్గీత అన్నారు. భాగవత మన్నారు. రెండుచోట్ల కృష్ణుడే ఆ భగవానుడు. ఆయన చెప్పిన మాట ఒకటైతే చేసిన చేష్ట మరొకటి. ఒకటి సిద్ధాంతం మరొకటి దాన్ని బలపరిచే దృష్టాంతం.
Page 99