#


Index

  లోకానికీ రెండు విధాలా ఇచ్చాడాయన పరమ పురుషార్ధ సందేశం. భగవానుడు కనుకనే అలా చేయగలిగాడు. జ్ఞానైశ్వర్య బల వీర్య శక్తి తేజస్సులనే షడ్గుణాలకూ భగమని పేరు. భగోస్యాస్తీతి భగవాన్. అవి కలవాడే భగవానుడు. ఈషాడ్గుణ్య మాయన జననం దగ్గరి నుంచీ నిర్యాణం దాకానే కాక నిర్యాణా నంతరం కూడా మనకవగత మవుతుంది.

  కృష్ణ నిర్యాణంతో భాగవత మారంభ మవుతుంది. ఇది ఒక చమత్కారం. ఏదో యాదృచ్ఛికంగా దొరలింది కాదిది. సాభిప్రాయం గానే వర్ణించాడు మహర్షి. కృష్ణుడు బ్రతికి ఉన్నంత వరకూ లోకంలో ధర్మ ప్రతిష్ఠ అనేది ఎవరికీ అర్థం కాలేదు. పాండవులు తమ వల్లనే అంతా జరుగుతున్న దని భావించారు. యాదవు లంత కంటే, రాజర్షులు, బ్రహ్మర్షులూ అంతాకూడా తమ ప్రభావమే ననుకొని ఉండవచ్చు. ఇది మీరెవరి వల్లా కాదు మీరంతా నిమిత్త మాత్రం నేనుంటేనే మీరుసుమా అని అందరినీ మౌనంగా హెచ్చరించటానికే ఆయన మరణం. కృష్ణుడి ఈ మరణ వృత్తాంతం హరి వంశంలో కానరాదు. అది ఆయన విజయ పరంపరను వర్ణించటంతోనే ముగుస్తుంది. సత్యమేవ జయతే అని నిత్య సత్యమైన భగవత్తత్త్వాన్ని నిరూపించటమే దాని ఉద్దేశం. ఇక్కడ అలాకాదు. ఆయన మరణం కూడా ఒక ప్రబోధమే నని చెప్పటం ముని హృదయం. మరణానికి ముందే పోయారు యాదవులంతా. ఇంకా మృతశేషులు కొందరుంటే వారిని తానే హతమార్చాడు. మరణవార్త విన్నారో లేదో పాండవు లిక నిలవ లేక మహా ప్రస్థానానికి బయలు దేరారు. రాజ వంశాని కంతా పరీక్షితొకడు మిగిలాడు. దేశమేలే బాధ్యత అంతా ఆయన మీదపడింది అయితే అప్పటికే కలియుగ మారంభ మవుతుంది. ఒకనాడు వేటకు వెళితే గో వృషభాల సంభాషణ వినిపించింది. అవి గో వృషభ రూపంలో దాగి ఉన్న ధరణీ ధర్మ దేవతలే. కృష్ణ భగవానుడు అస్తమించే సరికి లోకంలో సమస్త ధర్మాలూ - అస్తమించాయి గదా దీన్ని కాపాడే నాథుడే లేడా అని వాపోతాయవి.

Page 100