#


Index

కృష్ణ తత్త్వము

  కాబట్టి రాముడింతకూ లోకులకు ధర్మోపదేశం మాత్రం చేయవలసిన వాడు గనుక ఆయన జీవితం తావన్మాత్రం గానే సాగింది. పోతే కృష్ణుడు ధర్మోపదేశం కోసం కాదవత రించింది. ఆయన లోకులకు పరమ పురుషార్ధ మైన మోక్ష ఫలాన్నే అందివ్వాలని వచ్చాడు. కనుకనే రామాయణ మితిహాస మైతే భాగవతం పురాణ మయిందని ఇంతకు ముందే మనవి చేసి ఉన్నాను. మోక్ష పురుషార్ధమే భాగవతానికి వివక్షిత మైతే తత్ర దాత శ్రీ కృష్ణుడే దానికి కథా నాయకుడయ్యాడు. కృష్ణ చరితమనే భాగవతానికి నామధేయం. కృష్ణతత్త్వమే ఈ పురాణ పారిజాతానికి మూలం. తత్తత్త్వ వేత్త తదంశ సంభవుడూ ఆయిన కృష్ణ ద్వైపాయనుడే ఆ మహత్త్వాన్ని లోకుల కందివ్వ గలిగాడు. అది శుక ముఖంగా ఆకర్ణించి తరించిన వాడూ కృష్ణ రక్షితుడై కృష్ణ స్మరణైక పరాయణుడైన పరీక్షిత్తే. మొత్తంమీద అంతా కృష్ణ మయ మీ పురాణం. ఇది గుర్తించే పైకి రామ భక్తుడని పేరు పడసిన పోతన కూడా కలం చేత బట్టి వ్రాత కుపక్రమించినప్పుడే కృష్ణ గుణ సంకీర్తనతో ఉపక్రమించాడు.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్- లోకర క్షైకారంభకు- భక్త పాలన కళా సంరంభ కున్- దానవో ద్రేకస్తంభకు- కేళి లోల విలస దృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు- మహా నందాంగనా డింభకున్

  శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించిం దాయన ఎవరినో గాదు. కృష్ణ పరమాత్మనే. ఆయన నందాంగనా డింభకుడు. డింభకుడని పేరే గాని మహా డింభకుడు. మహా డింభకు డేమిటి- పెద్ద కుర్రవాడన్నట్టు.

Page 96