#


Index

  మమాపి హృదివర్తతే - నాకూ ఇది మనసులోనే ఉందని యమధర్మరాజుతో చెప్పిన మాటలో ఇది కూడా ధ్వనిత మవుతూ ఉంది. మిగతా విభీషణాదులు అందరూ వదలి పోయినా రాముడికి సీతాలక్ష్మణు లిద్దరూ ఇంకా వదలలేదు. వీరినీ వదిలించుకొంటే గాని తాను సుఖంగా వైకుంఠయాత్ర వెళ్లలేడు. అయితే ఆ వెళ్లేలోపల రాజ్యానికొక వారసుణ్ణి ఇచ్చి వెళ్లాలి. అది కూడా నెరవేరుతుందని గ్రహించాడు సీత గర్భం ధరించటంలో. సరే ఒకమంచి మహూర్తం చూచుకొని ఈవిడను ఆడవికి సాగనంపాడు. మరో ముహూర్తం చూచి లక్ష్మణుణ్ణి దేశంలో నుంచి దూరంగా వెళ్లగొట్టాడు. ఏకో నారాయణః అని తానొక్కడే మిగిలాడు చివరకు. ఎవరికెవరు. ఎవరికి వారే ఈ జీవులు. తానే గదా వర్ణించాడు ఇంతకు ముందు అయోధ్యలో యథాకాష్ఠంచ కాష్ఠంచ సమేయాతామ్ మహార్ణవే - సమేత్యచ వ్యపే యాతామ్ - తథాదారా స్సుతాఃపితా - అని. జీవుల పరిస్థితే ఇలాంటిదని వర్ణించినప్పుడిక దేవుడి పరిస్థితి చెప్పేదేముంది. కాబట్టి ఈ అవతార రహస్యం తెలిస్తే మనమిక ఈ విషయంలో ఎలాంటి విమర్శా చేయబోము.

  పోతే ఇక ఆఖరి ఆక్షేపణ రాముడి విషయంలో ఒక్కటే ఒకటున్నది. అది ఉత్తర కాండలో సీతా పరిత్యాగానంతరం జరిగిన శంబూక వధ, శంబూకుడేమి చేశాడని వాణ్ణి వధించటం. వాడొక శూద్రుడు. తపస్సు చేస్తున్నాడు. తపస్సు అనేది ఎవరినీ బాధించటం కాదు. వేధించటంకాదు. వాడిపాటికి వాడు చేసే పని. మంచిపనేగాని చెడ్డపనిగాదు. అది నేరమెలా అయింది. నేరం కాకపోతే వాణ్ణి చంపటం దేనికి. వాడి తపస్సు మూలంగా ఒక బ్రాహ్మణ కుమారుడు చచ్చాడనటం- అందువల్ల అది అధర్మమనటం ఏమి సబబు. ఎవడి ప్రారబ్దంవల్ల వాడు చస్తాడుగాని ఒకడు చేసిన దానివల్ల మరొకడు చచ్చేదేమిటి. పైగా ఆధర్మమెలా అయింది తపస్సు. కాకుంటే దానివల్ల పిల్లవాడు మరణించాడని చెప్పటమేమిటి. చూడబోతే ఇదంతా అగ్రజాతులు అవరజాతుల మీద చేసే దారుణమైనా అన్యాయమూ అక్రమమూ అని చాలా మంది ఈ రోజుల్లో చేస్తూన్న ఆక్షేపణ.

Page 91