#


Index

  కాని ధర్మ మార్గంలో తాను నడుస్తూ లోకాన్ని నడపవలసిన వాడు చేయవలసిన కార్యమా ఇది. నిజంగా అపరాధి అయితే శిక్షించవచ్చు. ఆవిడ చేసిన అపరాధ మేమిటి ఇందులో. రాక్షసుని బారినుండట మపరాధం కాదుగదా. ఆవిడది కాక పోయినా పరోక్షంలో వాడేదో దురుసుగా ప్రవర్తించి ఉంటాడనటానికి బలవంతంగా ప్రవర్తిస్తే తల వేయి ప్రక్కలవుతుందని శాపమే ఉంది గదా వాడికి. అందుకే గదా వాడొక సంవత్సరం తన ఆధీనంలో ఉన్నా ఆవిడనేమీ చేయలేకపోయింది. పోనీ అది ఎవడు నమ్మాడంటావా లంకలోనే రాక్షస, వానరులందరి సమక్షంలో ఆవిడ నిష్కల్మషత్వం ఋజువయింది గదా. అలాంటప్పు డయోధ్యలో ఎవరో కొందరు పామరులన్న మాటను పాటిగా తీసుకొని నిండుచూలాలని కూడా చూడక ఆవిడను పరిత్యజించటమా. ప్రజల కోస మంటావా, ఆవిడ మంచిదనే ప్రజలు కూడా అన్నారు గదా. వీరికోసం వదులుకోకపోతే వారికోస మేలుకో రాదా. ఒక్కడన్నా అది మాటే గదా అంటావా. అలాగైతే ఎవడో ఒకడు కావాలని ఎప్పుడొక అభాండం వేసినా వేయవచ్చు. ఎంతమందికెన్ని మార్లని నీవు జవాబు చెప్పగలవు. భార్యమీదగాక తల్లి మీదనే అపవాదం చేస్తే ఏమి చేయగలవు. అపవాదానికి పరిత్యాగమే పరిష్కారమైతే అన్నిటినీ పరిత్యజించి మానవుడిక బికారి అయి పోవలసిందే. కాబట్టి సీతా పరిత్యాగ మేవిధంగా చూచినా సమర్థనీయం కాదని ఆక్షేపణ.

  ఇది మనమే కాదు. ఆనాటి కాళిదాసాదులు కూడా సరిపుచ్చుకోలేక నంది మీదా పందిమీదా పెట్టి మనసులోని అక్కసు వెళ్లగ్రక్కుతూ వచ్చారు. త్వాం ప్రత్యకస్మా త్కలుష ప్రవృత్తా- వస్త్యేవకోపో భరతాగ్రజేమే-అని వాల్మీకి చేతనే అనిపించాడు కాళిదాసు. మరి భవభూతి అయితే రాముడు చేసిన పనికి రాముడి చేతనే చిందులు ద్రొక్కించాడు చివర దాకా. ఇదంతా ఒక ధర్మ సూక్ష్మం గ్రహించలేక మనం పడుతూ ఉన్న మధనే గాని మరేది గాదు. ఆ సూక్ష్మమేమంటే సాహిత్యమంతా ఒకానొక సత్యానికి కేవలం సంకేతమే.

Page 88