#


Index

  తన కోసమే పరమాత్మ అవతరించాడనే విషయమే, మరచి పోయి పామరంగా బ్రతుకుతున్నాడు. అహంకరించాడు. ఆ అహం కారానికి తగిన చికిత్స చేసి అతడి కళ్లు తెరిపించాలి స్వామి. ఇది కథలో, దాగి ఉన్న అంతరార్థం. దీనికి స్పోరకంగా సాగింది బాహ్యమైన కథ. అది రెండు విషయాలలో బయట పడుతుంది మనకు. కబంధుడు శాపవిమోచనా నంతరం రాముడికి భావికర్తవ్యాన్ని బోధిస్తూ కిష్కింధకు పొమ్మని- వాలి సుగ్రీవులలో వాలితో గాక సుగ్రీవుడితోనే మైత్రి చేయమని చెబుతాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడని అతణ్ణి వాలి అనవసరంగా బాధించాడని కూడా విన్నవిస్తాడు. ఇది రాముడి అంతశ్చేతనలో దాగి ఉన్న ఆత్మారాముడికి తన కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చింది. పోతే మరొక విషయం. సీతను రావణు డెత్తుకుపోయే సంరంభంలో ఆవిడ తన సొమ్ములు తీసి మూట గట్టి క్రిందికి చూచి సూటిగా ఋశ్యమూకం మీద కూచుని ఉన్న సుగ్రీవాదుల ముందే పడవేసింది. అంటే రాము డెప్పటికైనా రావలసిందీ సఖ్యం చేయవలసిందీ సుగ్రీవుడితోనే-వాలితో గాదని చెప్పినట్టయింది. అదే దైవ నిర్ణయం. దైవ నిర్ణయ మేమిటింతకూ. రావణ సంహారం. దానికోసమే రామావతారం. ఆయనకు తోడ్పడవలసినవారెవరు. వాలి సుగ్రీవులుగా అవతరించిన దేవతలే. అది విస్మరించిన వాడెవడిప్పుడు. వాలి. అందుకే వాడి విషయం చెప్పలేదు కబంధుడు. అమ్మవారు సొమ్ము లక్కడ న్యాసముంచలేదు. రామ కార్యార్థ మెదురు తెన్నులు చూచే సుగ్రీవుడు అందులకు పాత్రుడు. అందుకే అతనితో మైత్రిచేసి వాలిని వధించాడు. రాముడు. ఇది అన్ని ఆక్షేపణలకూ ఆంతర్యంలో ఇవ్వవలసిన ఆఖరి సమాధానం. తస్మాదనతి శంక నీయోయమ్ వ్యవహారః.

  పోతే రాముడు సీతను పరిత్యజించటం ఎంతవరకూ సమర్థనీయ మనేది మరొక ఆక్షేపణ. వాలి వధ పరకీయమైతే ఇది స్వకీయమైన సమస్య. సీత తనకు సహధర్మచారిణే కావచ్చు. ఆవిడ మీద తన కెంత అధికారమున్నా ఉండవచ్చు.

Page 87