సమాధానాలేనని మనవాళ్ళ అభియోగం. భరతుడు రాజుగాని రాముడేమిటి రాజు. రాజ్యాధికార మతనికెక్కడిది. భరతుడెప్పుడు నియోగించా డతణ్ణి. ఇది ఒక ప్రశ్న. మానవుల శిక్షా స్మృతి పశుపక్షి మృగాదుల కెలా వర్తిస్తుంది. ఇది రెండవ ప్రశ్న. వర్తించిందేపో. ఎన్నో ఉన్నాయిగదా మృగాలు అరణ్యంలో. అవి తమలో తాము వావి వరుసలు లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నాయో. వాటి నన్నిటినీ అలాగే శిక్షించాలి గదా- శిక్షించాడా మరి. మూడవ ప్రశ్న. సుగ్రీవుడితో సఖ్యం చేశాను కాబట్టి అతడికి మేలు చేయాలనట మేమిటి. అసఖ్యం వాలితోనే చేయవచ్చు గదా. నాలుగవప్రశ్న.
వీటికి జవాబు రాముడి మాటలలోనే ఉంది బాగా ఆలోచిస్తే. దానికి తోడు పూర్వాపరాలు కలియబోసుకొని చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకు. రాముడు రాజేమిటని గదా సందేహం. రామ భరత సంవాదంలో తెలుస్తుందీ రహస్యం మనకు. భరతుడూరక ప్రాణం తీస్తుంటే పట్టణానికి రమ్మని-రాజ్యపాలన చేయమని-రాముడతనితో ఇలా అంటాడు. త్వమ్ రాజా భరతభవస్వయం నరాణామ్-వన్యానా మహమపి రాజరాణ్మృగాణామ్ - నీవు జనపదంలో నరుల కందరికీ పాలకుడవై ఉండు. నేనీ జనస్థానంలో మృగ జాతులన్నీటికీ పాలకుడనై ఉంటాను. గచ్ఛత్వం పురవరమద్య సంప్రహృష్టః - సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే. ఇక నీవు సంతృప్తి పడి అయోధ్యకు వెళ్లు. నేనూ సంతృప్తితో దండక ప్రవేశిస్తాను. ఛాయాంతే దిన కరభాః ప్రబాధమానమ్-వర్షత్రమ్ భరత కరోతు మూర్థ్ని శీతామ్ నీకు ఎండ తగలకుండా శ్వేతచ్చత్ర మున్నట్టే. ఏతేషా మహమపి కానన ద్రుమాణామ్- ఛాయాంతా మతిశయినీమ్ సమాశ్రయిష్యే. నాకూ ఇక్కడ ఉన్న ఈ కానన ద్రుమాలు గొడుగు పట్టి నీడనిస్తాయి. శత్రుఘ్నఃకుశలమ తిస్తుతే సహాయః సౌమిత్రిర్మమ విహితః ప్రధాన మిత్రమ్, మరి నీకు మంత్రి శత్రుఘ్నుడయితే- నాకీ సౌమిత్రి మంత్రిగా ఉంటాడంటాడు. ఇలా ఇద్దరూ ఒకరు పట్టణాలలో ఒకరు అరణ్యాలలో రాజ్యం చేద్దామని ఒప్పందం చేసుకొన్నారు.
Page 83