ఇదిగో అధర్మం అతనిలో ఉండటం పరమాత్మగా తాను సహించలేక పోయాడు రాముడు. ఎంత పెద్దవాడైనా పరుశురాముణ్ణి లాగా అతణ్ణి శిక్షించవలసిందే. అయితే పరశురాము డంటే పరాయివాడు. బ్రహ్మణుడయి కూడా కర్కశమైన క్షాత్ర ధర్మ మవలంబించి అనుచితంగా అనేక మందిని వధించి అందరి సానుభూతినీ కోలుపోయాడు. పైగా పెండ్లి కుమారుడని కూడా చూడకుండా తన్ను దారిలో అడ్డగించాడు. కయ్యానికి కాలు దువ్వాడు. అలాంటివాణ్ణి నిగ్రహించినా చుట్టూ ఉన్న వారేమనుకోరు. పైగా తగిన పాఠం చెప్పాడని మెచ్చుకొంటారు. ఇక్కడ అలా కాదు. ఇతడు తండ్రి హోదాలో ఉన్నాడు. అతడు కాముకుడో ధార్మికుడో వ్యక్తిగతమైన ఆ స్వభావం ప్రజలకు తెలిసేది కాదు. వారికది అక్కరలేదు. పైగా కైక తండ్రికి మాట ఇచ్చిన రాజరహస్య మెవ్వరికీ తెలియదు. అలాంటి సందర్భంలో తండ్రి చేసిన చర్య నలుగురిలో ఎలా బయటపెట్టటం. ఆయనను నలుగురిలో నిలదీసి అడగటం గాని నీవు చేసింది తప్పని చాటటం గారి అ సందర్భం. నలుగురి దృష్టిలో ఆయన ఇంకా పలచనయి పోతాడు. ఇది తనకే అవమానకరం. తండ్రిని గౌరవించటం తనయుడిగా తన కర్తవ్యం. అయితే. ఆయనలో ఒక దోషమున్నది. ఒక దౌర్బల్య మున్నది. దానికి మాత్రం తగిన దండన విధించాలి. కాని అది పదిమందిలో బాహాటంగా చేయరాదు. లోకాని కాదర్శంగా తన పుత్ర ధర్మాన్ని తను పాటించాలి. తనకు లోపల దేవుడనే జ్ఞానమున్నా జీవుడి మాదిరే నడుచుకోవాలి పైకి. కనుక అలాగే నడుచుకొన్నాడు. అయోధ్యలో ఉన్నంతవరకూ పైకి తేలలేదు. పల్లెత్తుమాట అనలేదు. పరిస్థితు లెప్పటికప్పు డెలా మారుతున్నా ఉలకలేదు. పలకలేదు. మౌనంగా చూస్తూ, చేస్తూ వచ్చాడు.
కాని అంతమాత్రం చేత తండ్రి చేసింది అధర్మం కాకపోదని తెలుసు రాముడికి. పదిమందిలో కాకపోయినా ఎక్కడో ఒక చోట అది బయట పెట్టి తీరవలసిందే.
Page 68