కైకకే ఇచ్చి ఉంటే ఆవిడకే పుత్రుడు జన్మించి వాడే జ్యేష్ఠుడై రాజనీతి ననుసరించి వాడికే రాజ్యం లభించి ఉండేది. నీతి తప్పినాడన్న అప్రతిష్ఠకు గురి అయ్యే వాడు కాదు. అలా కాక అందరికీ పంచి పెట్టేసరికి ముందుగా రాముడు జన్మించి జ్యేష్ఠుడయి కూచున్నాడు. భరతుడు తరువాత పుట్టి అతనికి తమ్ముడయ్యాడు. రాజ్యమిప్పు డితనికివ్వటమా- అతనికివ్వటమా-జ్యేష్ఠుడని ఇస్తే మాట తప్పిన వాడవుతాడు. మాట నిలెబెట్టుకుంటే రాజనీతికి జలాంజలి ఇచ్చినవాడవుతాడు. అయితే ఇప్పుడేమి చేశాడు. కైక కొడుకుకే కట్టబెట్టాడు రాజ్యం. ఏమి కారణం. జ్యేష్ఠుడైనా రాముణ్ణి కాదని వాడికే ఇవ్వవలసిన కారణమేమి. మాట నిలబెట్టు కోటాని కంటావా. ఏదో ఒకటి వదులుకో వలసినప్పుడు మాటనే వదులుకొని రాజనీతినే పాటించవచ్చు గదా- ఇక్కడ ఉంది రహస్యం.
దశరథుడు ముదుసలి అని పేరేగాని అతడు మొదటి నుంచీ కాముకుడు. కాంతా లోలుడు. రాముడి మాదిరి ఏకపత్నీ వ్రతుడూ జితేంద్రియుడూ కాడు. ఆ కాముకమైన స్వభావంతోనే కైకను చేసుకొన్నాడు. బరోసాగా మాట ఇచ్చాడు. మరలా పుత్రకామంతోనే ఇష్టి చేశాడు. పాయస మందరికి అమాయికంగా పంచి ఇచ్చాడు. చివరకు దాని ఫలితం విషమించే సరికి కామంతోనే కైకకు వశుడయి పోయి కులక్రమాగతంగా రాముడికి చెందవలసిన రాజ్యమతణ్ణి కాదని భరతుడికి కట్టబెట్టాడు. అది మరలా బాహాటంగా బయట పెట్టలేక బాధపడుతూ వచ్చాడు. ఈ విషాదగాధ కంతా మూల మేదో గాదు. ఆ వృద్ధరాజు కామ పర్వతమే. స్త్రీలోలత్వమే. అది లోకంలో ఎవరికున్నా పనికిరాదు. ముఖ్యంగా దేశమేలే రాజుకు. తనకే గాక రాజ్యానికే ముప్పు తెస్తుంది అధర్మ చర్యకు దారి తీస్తుంది. నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది.
Page 67