ఇలా లోపల ఒకటి బయట ఒకటిగా వ్యవహరించేవాడు ఉత్తమధర్మ పరాయణుడనే గౌరవానికి ఎలా పాత్రుడు కాగలడని ప్రశ్న. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది నిజమే. కాని అపాతతః గాక కొంచెం లోతుకుదిగి చూడవలసిన విషయమిది. రాముడు కేవలం మానవమాత్రుడు కాడు. ధర్మ సంస్థాపన కోస మవతరించిన పరమాత్మ. ధర్మాన్ని తాను ఆచరిస్తూ పదిమంది చేత ఆచరింప జేయవలసిన వాడాయన. అలా ఆచరించక పోయినా అందులో ఏవైనా అవకతవకలు చేసినా క్షమించడు. వాణ్ణి శిక్షించి' మంచి మార్గానికి త్రిప్పటమే ఆయన కర్తవ్యం. దానికీ తరం కాకపోతే ఆయన నిజమైన శిక్షకు వాడు గురికాక తప్పదు. తాను గురుజనం పట్ల శిష్య ధర్మం పాటిస్తూ గురుధర్మం పాటించని పరశురాముణ్ణి అలాగే గదా శిక్షించాడు. అంతేకాదు. తాను తాపసుల యెడ క్షత్ర ధర్మాన్ని పాటిస్తూ తాపస ధర్మాన్ని ఉల్లంఘించిన మారీచుణ్ణి మరలా శిక్షించాడు. మిత్రధర్మాన్ని తాను పాటించినట్లు సుగ్రీవుడు పాటించ లేదని అతణ్ణి శిక్షించబోయాడు. స్వామి ధర్మం పాటిస్తూ భృత్యధర్మం పాటించలేదని సముద్రుడి మీద బాణం ప్రయోగించాడు. అలాగే వీర ధర్మం పాటించని రావణుణ్ణి మట్టుబెట్టాడు. రాజధర్మం తాను తప్పని వాడవుతూ ప్రజలు తమ ధర్మం తప్పితే మరలా ఆగ్రహం చూపాడు. అదే శంబూకుణ్ణి వధించటం. ఇలా తాను ధర్మం పాటించటం వరకే గాదు. ఎవరి ధర్మం వారు పాటించక పోయినా మన్నించడు. వారి వారికి తగిన శిక్ష విధిస్తూనే వచ్చాడు.
ప్రస్తుత మిక్కడ అలాగే జరిగింది వ్యవహారం. దశరథుడు చేసింది అక్షరాల తప్పు. అతడు కైక తండ్రికి చేసిన వాగ్దానమే ముప్పయింది. వెనుక ముందు లాలోచించకుండా ఆ రాజలా మాట ఇవ్వకూడదు. ఇచ్చిన వాడిక పుత్రకామేష్టి కుపక్రమించరాదు. ఉపక్రమించినా ఆ ప్రాజాపత్యుడిచ్చిన పాయసాన్ని రాణులందరికి పంచి పెట్టక కేవలం కైకకే ఇచ్చి ఉండవలసింది.
Page 66