#


Index

  ఎప్పటినుంచో ఉందనేందుకిదే మనకు దాఖలా. రామాయణం అయోధ్యాకాండలో కచ్చిత్సర్గ అని ఒక అధ్యాయముంది. అది భరతుడు రాముణ్ణి తోడ్కొని పోవటాని కరణ్యానికి వచ్చినప్పు డాయనతో రాముడు చేసిన సంవాదం. కచ్చిత్తంటే ఏమిటి ఎలా ఉందని అర్థం. ఒక 60, 70 శ్లోకాలు ఈ కచ్చి చ్ఛబ్దంతో మొదలైనవి కనిపిస్తా యందులో మనకు. ఇవన్నీ రాజనీతికి సంబంధించిన అతి రహస్యాలూ-ధర్మ సూక్ష్మాలూ. రాముడి రాజనీతి ప్రావీణ్యమంతా ఈ ప్రశ్న పరంపరలో పదహారు కళలతో సాక్షాత్కరిస్తుంది.

  పోతే కిష్కింధలో వాలి నేల గూలి తనతో నిష్ఠుర మాడినప్పుడ తనికిచ్చిన సమాధాన పరంపరలో కూడా ఎంతో రాజనీతి దాఖలా అవుతుంది. అయితే ఇదంతా శాస్త్రజ్ఞానమేగాని అనుష్ఠానంలో కూడా అలాంటి అభినివేశముందా రాముడికనే ప్రశ్న రావచ్చు. జ్ఞానానికెప్పుడూ అనుష్ఠానమే పరిపూర్ణత నిచ్చేది. అది లేనిదే వట్టిమాటలెన్ని చెప్పినా అవి వట్టివే గాని గట్టితన ముండదు వాటిలో. మరి రాముడెంత శాస్త్ర పారంగతుడో అంత అనుష్ఠాన సారంగతుడు. అదే మనకు రామాయణోత్తర భాగంలో నిరూపిత మవుతుంది. రెండే రెండు ఘట్టాలు. ఒకటి సీతా పరిత్యాగమూ-మరొకటి శంబూక వధ. ఈ రెండూ చాలు రాముడి ప్రజానురంజక పరిపాలన మనేది ఎట్టిదో మనకు పట్టి ఇవ్వటానికి. ప్రియాహి సీతారామస్య-ప్రాణేభ్యోపి గరీయసీ-సీత అంటే రాముడికి ప్రాణం. రెండవ జీవితం. ఆవిడనొక సంవత్సరం చూడకపోతే తన జీవితమే నిరుపయోగమని భావించిన నిష్కల్మష ప్రేమయోగి. అలాంటివాడు ఉన్నట్టుండి ఒక పామరుడన్న మాటకు బద్దపడి తృణ ప్రాయంగా పరిత్యజించి ఇక మరలా ఆవిడ ముఖం చూడనే లేదంటే ఎంత ధర్మదీక్ష-ప్రజాభిప్రాయమంటే ఎంత ప్రామాణ్య బుద్ధి. పదిమంది మెచ్చిందీ వారికి నచ్చిందీ పరిపాలన అంటే. తన కుట్రవడియంగా వచ్చిందికాదు.

Page 62