#


Index

వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చాడేగాని దారి ఇవ్వటాని కుద్యుక్తుడు కాలేదు. మరి కృష్ణుడికో పార్థసారథికమైన రథాన్ని అల్లంత దూరాన చూచాడో లేదో హడలిపోయి ఆ రథం వెళ్లినంత దూరం శిలారూపుడై పడిపోయాడు. కృష్ణుడి రథం సప్తకుల పర్వతాల మీదుగా కూడా ఎగిరిపో గలిగితే రాముడి రథం భూమిమీద పయనించటమే ఎక్కువయింది. అంతేకాదు. రాముడు తన జీవితంలో ఎవరికిగాని గురుత్వం వహించలేదు. ఒకరి కుపదేశం చేయలేదు. మీదు మిక్కిలి వసిష్ఠ విశ్వామిత్రాగస్త్యాదు లందరికీ శుశ్రూషచేసి వారి వల్ల అన్ని విద్యలూ అభ్యసించవలసి వచ్చింది. కృష్ణుడలా కాదు. గర్గసాందీపనాదు లాచార్యులని ఒక లాంఛనమేగాని వారితో సహా అందరికీ తానే ఆచార్యకం వహించాడు. కష్టసమయాలలో వారి నాదుకొన్నాడు. అద్భుతమైన లీలలు ప్రదర్శించి వారి కుపదేశంతోపాటు ఉపకారం కూడా చేశాడు. ఇంతెందుకు. అసలు ప్రతి ఒక్కటీ ముందుగానే తెలిసి చేసినట్టు కనిపిస్తుంది కృష్ణావతారంలో. రామావతారంలో ఏ ఉపద్రవ మెప్పుడు వచ్చిపడితే అప్పుడది అనుభవించినట్టే తోస్తుంది మనకు. చివర కంతమంది కాంతలతో సతమతమై కూడా కృష్ణుడు వారి నవలీలగా వదులుకో గలిగితే రాముడు ఒకే కాంత నొక సంవత్సరకాల మెడబాసి బ్రతకటానికి బెంబేలు పడతాడు.

  ఇలా జీవిత విధానమేగాదు. వేషభాషలు చూచినా ఇద్దరికీ ఎంతో అంతరం కనిపిస్తుందని చెప్పాము. కృష్ణుడి రూపంలో కనిపించినట్టు రాముడిలో మూల విరాట్టయిన విష్ణువురూపం కనిపించదు. కృష్ణుడు చతుర్బాహువైతే రాముడు మనలాగే కేవలం ద్విబాహువే. ఆయన పీతాంబరమూ - వనమాలా - కౌస్తుభమూ - ఇలాంటి విష్ణుచిహ్నాలన్నీ ధరించితిరిగితే ఈయన కేవలం ధనుర్భాణాదులు ధరించి ఒక సుక్షత్రియుడి వేషంలోనే కనిపిస్తాడు. ఒకేసారి అనేక రూపాలు ధరించగలడు కృష్ణుడు. రాముడు జీవితాంతమూ ఒకే రూపంలో తప్ప ఇన్ని రూపాలలో ఎప్పుడూ కనిపించలేదు.

Page 6