ఎలాగైనా మా దీక్షారక్ష చేయమని కాళ్లవేళ్లా పడ్డారు. అందుకే నేను వారికి మాట ఇచ్చాను. అసలు వారడగకపోయినా ఇవ్వవలసిన మాట అది. అలాంటిది ఇచ్చి తప్పటమా. అది కలలో జరగని విషయమంటాడు. చూడండి ఉత్తమక్షత్ర ధర్మమంటే ఎలాంటిదో. ఇలాంటి ధర్మాన్నే చివరదాకా వదలకుండా పాటిస్తూ వచ్చాడు రాముడు. కడకు వాలి తన్ను వధించట మన్యాయమని తప్పు పట్టినా మేము క్షత్రియులం. ఆర్తత్రాణ పరాయణత్వమే మా కర్తవ్యమని అతనికి తన క్షత్ర ధర్మాన్ని వివరించి చెబుతాడు.
క్షత్రధర్మమైన తరువాత నాలుగవది మిత్ర ధర్మం. ఇది కిష్కింధలో మనకు దాఖలా అవుతుంది. సుగ్రీవుడి విషయంలో పాటించింది మిత్ర ధర్మమే. ఆ మాటకువస్తే అయోధ్యలోనే వస్తుందీ మిత్ర ధర్మం. గుహుడనే నిషాద రాజాయన కెంతో ప్రియ మిత్రుడు. తన నిషాద రాజ్యాన్నే ఆయన కప్పగిస్తానన్న ప్రాణ స్నేహితుడు. పోతే ఇక సుగ్రీవుడి విషయం చెప్పనే అక్కరలేదు. అతని పట్ల రాముడు చూపిన మైత్రి ఎసలేనిది. అతణ్ణి అంత వరకూ చూడలేదు పెట్టలేదు రాముడు. కబంధుడు చెప్పేవరకు అతడి ఊసే తెలియదు. కబంధుడు తన చేత శాపవిముక్తుడయి సుగ్రీవుడనే వానర రాజున్నాడు. అతడు సత్యసంధుడు. వినీతుడు. ధృతిమాన్ మతిమాన్ మహాన్ అని అతడి గుణగణాలు వర్ణించి సతే సహాయోమిత్రంచ భవిష్యతి-అని ఎప్పుడన్నాడో అదే రాముడి కతని మీద మైత్రికి కారణ మయింది. సుగ్రీవుడు కూడా వారిని దూరం నుంచి చూచి భయపడ్డా ఒక అవ్యక్తమైన మధురానుభూతి ననుభవిస్తూనే వచ్చాడు. దీర్ఘబాహూ విశాలాక్షౌ శరచాపాసిధారిణా - కస్యనస్యా దృయం దృష్ట్వా -హ్యేతౌ సురసుతోపమౌ-అని మొరపెడతాడు హనుమంతుడితో. ఈ వర్ణన చూస్తే ఇలాంటివాడు తనకు మిత్రుడైతే ఎంత బాగుండు వాలిని తప్పకుండా జయించవచ్చుననే ఆశ కూడా ఇమిడి ఉంది ఇందులో. వీరిని చూస్తే ఎవరికి భయం కలగదనటంలో వాలి అయినా సరే భయపడ వలసిందే.
Page 51