తరువాత అభిషేక భంగమయి మరలా తన్ను పిలిపించినపుడు కూడా ఏదో మహత్తరమైన పని అయి ఉంటుందని ఆలోచిస్తూ వచ్చి తండ్రిని చూడగానే ఆయన రామా అని మాటాడలేక పడిపోతే ఎంతగానో భయపడతాడు. ఎప్పుడు వచ్చినా ఆనందంగా పలకరించే తండ్రి ఎందుకిలా ఆయాస పడుతున్నాడు. బహుశ నా వల్లనే ఏదైనా అపచారం జరిగి ఉంటుందని బాధపడుతాడు. పైగా ఒకమాట అంటాడు. అతోషయన్ మహారాజ - మకుర్వన్వా పితుర్వచః- ముహుర్త మపి నేచ్ఛేయం-జీవితుమ్ -తండ్రి మాట పాటించకుండా ఆయన మనసుకు సంతోషం కలిగించకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలే నంటాడు. ఇంకా తండ్రి తనతో పలకలేదు. భాషించలేదు. అది తన అపరాధమే అయి ఉంటుందని ఎలాగైనా ఆయనను సంతోష పెట్టి తన అపరాధం పాపుకోవాలని భావించాడంటే ఎంతటి పితృప్రేమో ఇది చూడండి. పిమ్మట కైక చెబితే జరిగిన సంగతి తెలిసి ఇలా అంటాడామెతో. అమ్మా ఆయన నాతో చెప్పబనిలేదు. నీవు మాత్రం నాకు ఆరాధ్యవు కావా. నీవు చెప్పినా నేను వెళ్లటానికి సిద్ధమే. అయితే ఆయన నోరు విప్పి మాట్లాడలేదే అని నా బాధ అంటాడు. తల్లిదండ్రుల మాట పాటించటంలో ఎంత సంసిద్ధతో చూడండి. అంతేకాదు. ననూనం మయికైకేయి - కంచి దాశంససే గుణమ్ నీకు నా మీద హక్కుండికూడా తండ్రి మీద నెపం పెడుతున్నావంటే నిజంగా నాలో పుత్రుడి కుండవలసిన గుణమే కొంచెమూ లేదని తోస్తుందంటాడు. తల్లిని తప్పుపట్ట వలసిన చోట కూడా ఆ తప్పు తనది గానే భావించాడంటే తల్లి దండ్రుల పట్ల ఎంత వినయమో- ఎంత గౌరవమో చూడండి. వందిత్వా చరణారామో విసంజ్ఞస్య పితుస్తదా -కైకేయ్యాశ్చా ప్యనార్యాయా - నిశ్చక్రామ మహాద్యుతిః తరువాత తెలివి తప్పిపడి ఉన్న తండ్రికి - దారుణంగా ప్రవర్తించిన తల్లికి ఇద్దరికి పాదాభివందనం చేసి మౌనంగా నిష్క్రమించాడట మందిరాన్ని, ఎంత గంభీరమైన మాటోఇది. అన్నీ తెలిసి కూడా ఏమీ ఆక్షేపణ చేయకుండా పోవటమే ఉత్తమకుమార లక్షణం.
Page 47