#


Index

  ఇలా చూస్తూపోతే రాముడిలో సచ్ఛిష్యుడి కుండవలసిన లక్షణా లొకటిగావు, రెండుగావు. ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. కనుకనే గుర్వనుగ్రహం వల్ల ఆయన సమస్తాస్త్రశస్త్ర కుశలుడూ ప్రతీప శక్తి నిర్వాపణదక్షుడూ - కావటమే గాక సాక్షాలక్ష్మీ స్వరూపిణి అయిన మైథిలిని కరగ్రహణం చేసి గురుకులం నుంచి సమావర్తనం కూడా చేసి ఉత్తమ గృహస్థ జీవితంలో ప్రవేశించినవాడూ అయ్యాడు. అంతేకాదు. తాను శిష్య ధర్మ మెలా పాటించాడో అలాగే గురువులు కూడా గురుధర్మాన్ని పాటించాలని ఆయన దృష్టి, అలా పాటించిన ఆచార్యుణ్ణి ఎలా అనుసరిస్తాడో పరమాత్మ – పాటించని వారినలా శిక్షిస్తాడు కూడా. సరిగా పరశురాముడి విషయంలో సాక్షాత్కరించిందిది. బ్రాహ్మవంశంలో పుట్టి క్షత్రియుడైన తనకు గౌరవ పాత్రుడు కావలసిన అతడు నిష్కారణంగా సమస్త క్షత్రియవంశాన్ని నిర్మూలించటమే గాక క్రొత్తగా వివాహితుడయి వెళ్లుతున్న తనతోనే దారిలో జగడం పెట్టుకొన్నాడు. సగర్వంగా మాటాడాడు. అలాంటి ఔద్ధత్యమెవరిలో ఉన్నా సహించడు భగవానుడు. కనుకనే ఇది మీ బోటి పెద్దలకుండవలసిన లక్షణం కాదన్నట్టు సుకుమారమైన శిక్ష విధించా డాయనకు.

  పోతే శిష్య ధర్మమైన తరువాత రెండవది పుత్రధర్మం. అయోధ్యలో తార్కాణమవుతుంది మనకు. మాతృదేవోభవ - పితృదేవోభవ అన్నారు. తనయుడికి తల్లిదండ్రులే మొదటి గురువులు. దేవతలలాగా ఆరాధనీయులు. రాముడు తన జననీ జనకుల విషయంలో అలాగే ప్రవర్తించాడు. తుదకు సీతను తాను పెండ్లి చేసుకొన్నది కూడా వీర్యశుల్క అని కాదట. దారాః పితృకృతా ఇతి - తన తల్లిదండ్రులు చూచి చేశారని అంటాడు వాల్మీకి. అసలు దశరథుడు తన కుమారులు నలువురూ తన శరీరం నుంచి వెలువడిన నాలుగు చేతులని భావించే వాడట. వారిలో కూడా రామో రతికరః పితుః రాముడాయన కంటికి దీపం లాంటివాడు. అలాంటివాడు కనుకనే కదానామ సుతం ద్రక్ష్యా మ్యభిషిక్త మహం ప్రియమ్మని ఎంతో కాంక్షిస్తాడు.

Page 44