#


Index

  అంతేకాదు. గురువు ధర్మదీక్షలో ఉన్నప్పుడాయన కెలాటి విఘ్నాలూ ఉపద్రవాలూ సంభవించకుండా చూడటం శిష్యుడి బాధ్యత, ఛాత్రుడని గదా శిష్యుణ్ణి పేర్కొంటారు. ఛాదయతీతి ఛత్రం - ఛత్రవ దాచరతీతి ఛాత్రః ఒక ఛత్రంలాగా గురువును కాపాడే వాడు కాబట్టి ఆ పేరు వచ్చింది శిష్యుడికి. ఆరు రాత్రుల వరకూ దీక్షలో ఉన్న ఆచార్యుణ్ణి మారీచసుబాహుల బారి నుంచి కాపాడి ఆ పేరు సార్థకం చేసుకొన్నారు రామలక్ష్మణులు. పైగా అద్యైవ దీక్షాం ప్రవిశ - భద్రమ్తో మునిపుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధఃస్యాత్ - సత్యమస్తు వచస్తవ - ఇవాళే తాము దీక్షలో ప్రవేశించండి. మీకు తప్పక విజయం కలుగుతుంది. ఇది సిద్ధాశ్రమం గదా. సిద్ధి కలగక పోవటమేమిటని బరవసా ఇస్తారు. ఆ తరువాత ప్రీతుడైన ఆచార్యుడు వారికి మరలా అస్త్ర ప్రదానం చేస్తాడు. కథలు చెబుతాడు. అంతేగాక తన తపస్సును సఫలం చేసినందుకాయన బ్రహ్మచర్యాన్ని కూడా ఫలవంతం చేయాలనుకొన్నాడు. బ్రహ్మచర్యానికి ఫలమేమిటి. గార్హస్యమే. అది సీతా కళ్యాణంతో గాని జరగదు. దానికి ధునుర్భంగం పణమని తెలుసు విశ్వామిత్రుడికి. అది చేయగలవాడు తన ప్రియ శిష్యుడు రాముడేననీ తెలుసు. అందుకే వచ్చినపని నెరవేరినా ఇంకా అతనితో పని ఉన్నట్టు రాముణ్ణి వెంట బెట్టుకొని మిథిలాపుర ప్రయాణం. గురువనుజ్ఞ లేకుండా ఏ పనీ తలపెట్టరాదు శిష్యుడు. అందులో తనకెంత అభిలాష ఉన్నా సరే. సామర్థ్యమున్నా సరే ధనుర్దర్శయ రామాయ అంటాడు జనకుడితో విశ్వామిత్రుడు. తెప్పించి చూపుతాడు. వత్స రామ ధనుః పశ్య రామ ! వెళ్లి ఆ ధనువునుచూడు - అంటాడు మరలా రాముణ్ణి చూచి. అలాగేనని వెళ్లి ధనువును మంజూషలో నుంచి బయటకి తీసి దీనిని తోలనం చేయమంటారా పూరణం చేయమంటారా ఏమిచేయమని మీ ఆజ్ఞ అని అడుగుతాడు. బాఢమిత్యేవ తంరాజా మునిశ్చ సమభాషత - అలాగే చేయమని రాజు - మునీ ఒకేసారి అంటారు. కుతూహలం కొద్దీ జనకుడూ శిష్యుడందుకు సమర్థుడేనని విశ్వామిత్రుడు.

Page 43