శిష్యుడడగటం ధర్మం కాదు. తెలుసుకోవాలని ఎంత కుతూహలమున్నా వినయపరుడైన శిష్యుడికది శోభనివ్వదు. అది తెలిసే రాముడూర కున్నాడు. అయినా ప్రస్తావ వశంగా అది గురువుగారి నోటనే వచ్చింది. అయితే తాను చేసిన ఘన కార్యాలూ - మేనకాదులతోడి తన విహారాదులూ తన నోటనే రాగూడని విషయాలు. అవి జనక మందిరంలో అహల్యానందనుడైన శతానందునిచేత పలికిస్తాడు వాల్మీకి. శిష్యుడి ఎదుట ఆయన గురువుగారి మాహాత్మ్యం మరొకరిచేత చెప్పించటంలోనూ తన్ముఖంగా శిష్యుడు గ్రహించటం లోనూ ఎంతైనా ఔచిత్యముంది. ఔచిత్యంతో పాటు ఒక నాటకీయత కూడా చోటు చేసుకొన్నది.
ఆచార్యుడంటే అన్నీ తెలిసిన రాముడికి కూడా ఎంతో గౌరవం ఆయన ఎడల ఎంతో ప్రామాణ్య బుద్దీ. తాటకను వధించమని గురువుగారా దేశిస్తే స్త్రీని వధించట మెలాగా అని పై కనక పోయినా లోపల సందేహంగానే ఉంది రాముడికి. అది గమనించి విశ్వామిత్రుడునహితే స్త్రీ వధకృతే ఘృణాకార్యా నరోత్తమ – చాతుర్వర్ణ్వహితార్థాయ - కర్తవ్యమ్ రాజసూనునా అని అతని సందేహ నివృత్తి చేస్తాడు. దానితో సంతుష్టుడైన రాము డాయనతో ఇలా అంటాడు. నన్ను మీతో పంపేటప్పుడు మా తండ్రిగారు శాసించారు గురువు మాట జవదాటరాదని. సోహం పితుర్వచః శ్రుత్వా . - శాసనా దృహ్మవాదినః - కరిష్యామి న సందేహః తాటకా వధ ముత్తమమ్ అని ఆయన మీద తనకున్న అచంచలమైన గౌరవాన్ని ప్రకటిస్తాడు. ఇలాంటి ప్రామాణ్య బుద్ధి ఉండాలి గురువుల విషయంలో ఏ శిష్యుడికైనా, గురువైన వాడు తనకే విషయం బోధించినా తెలియకుండా బోధిస్తాడా అనే శ్రద్ధాభక్తులుండట మెంతైనా అవసరం. అదే ప్రస్తుతం రాముడి పట్ల కూడా మనకు కనిపిస్తుంది.
Page 42