#


Index

అంత శమదమాది సంపన్నుడయి సాక్షాత్తూ గాయత్రీ మంత్ర ద్రష్ట అయిన వారొకరు. కనుకనే ఆయన వసిష్ఠుడు - సర్వశ్రేష్ఠుడు. ఈయన విశ్వానికంతా మిత్రుడు - విశ్వామిత్రుడు. ఇలాంటి వారి శిక్షణలో రాటు డేరిన రాముడెలాంటివాడు కావచ్చునో మన మూహించవచ్చు.

  రామాదులు జన్మించగానే జాత కర్మాదులూ నామకరణమూ చేసిన వాడు వసిష్ఠుడు కులపురోహితుడు గదా ఆయన. ఆయనే తరువాత వేదవేదాంగాది విద్యలు నేర్పి ఉంటాడు. దానితో వారు సర్వేవేదవిదః శూరాః సర్వేలోకహితే రతాః సర్వేజ్ఞానోపసంపన్నాః సర్వే సముదితాగుణైః అని లోకంలో పేరు గాంచారు. మరి ధనుర్వేద - గజస్కంధ - అశ్వపృష్ఠ - రథచర్యాది క్షాత్ర విద్యలన్నీ తండ్రి దశరథుడి వల్లనే అభ్యసించి ఉంటారు. పితృశుశ్రూషణేరతాః అనే మాటలో అదే ధ్వనిస్తుంది. తండ్రి కూడా గురువే గదా శాస్త్రీయంగా. పోతే తేషాం కేతు రివ జ్యేష్టో - రామోరతికరః పితు-రాము డందరిలోనూ పతాకలాగా ఎత్తుగా కనిపించేవాడు. విద్యాభ్యాసమంతా పూర్తి అయింది. కాని వాటికి మెరుగుపెట్టే ఘట్టమింకా జీవితంలో ఎదురవలేదు. మానుషదైవ శక్తులు రెండూ సమకూడ వలసి ఉంది. అవి సమకూడిన తరువాత కళ్యాణ ప్రాప్తికూడా అయి జీవితంలో ఒక స్థాయి నందుకోవలసి ఉంది. భావి రాక్షససంహారానికి కావలసిన శక్తి సామర్థ్యాలు సాధించి తన అవతార ప్రయోజనాన్ని నిరూపించుకునే అవకాశం కోసమెదురు చూస్తున్నాడా మహాపురుషుడు.

  సరిగా సమయానికి బయలుదేరి వచ్చాడు విశ్వామిత్రుడు. అధర్మపరులైన దానవులను తునుమాడి విశ్వానికంతా మేలు చేయాలని ఆయన సంకల్పం. అది సిద్ధించాలంటే ధర్మ సంస్థాపనకోస మదేపనిగా అవతరించిన రామచంద్రుడే సమర్థుడని తెలుసు నాయనకు. కనుకనే హడావుడిగా వచ్చాడు దశరుథుడి దగ్గరకు. రాముణ్ణి తనతో పంపమన్నాడు. దశరథుడు పుత్ర వ్యామోహంలో పడి వెనుకాడుతుంటే ధైర్యం చెబుతాడు.

Page 39