దండానికి దండమే. దేనికదే. కోపం వస్తే దేవతలైనా భయపడవలసిందే ఆయనకు. సముద్రాదు లలాగే కదా హడలిపోయారు.
షోడశ కళాధరుడైన చంద్రుడిలాగా షోడశ గుణాకరుడైన రామచంద్రుణ్ని ఇలా వర్ణించటం జరిగింది కావ్యారంభంలోనే. దానికను రూపంగానే కథా వస్తువు కూడా రూపుదిద్దుకొంది. పోతే రామో విగ్రహవాన్ ధర్మః- అని ప్రసిద్ధి గాంచినందు కాయన తన జీవితంలో పాటించిన పాలించిన ఆ ధర్మ మెలాంటిది. ఏయే ధర్మాలెక్కడ ఎలా పాలించాడు. ఎంత దీక్షతో పాలించాడు. దానివల్ల ఎదురయిన కష్టసుఖాలనెలా భరించాడలా పాటించిన వారి నెలా ఆదరించాడు. పాటించని వారి నెలా శిక్షించాడు. ఇలాంటి ధర్మమీమాంస చేయవలసి ఉంది మన మిప్పుడు. ముక్తసరిగా చెప్పుకొంటే బాల నుంచి ఉత్తర దాక ఏడు కాండల కథా జీవితంలో ఏడు ధర్మాలు సాగించాడు రామచంద్రమూర్తి . బాలలో శిష్య ధర్మం - అయోధ్యలో పుత్రధర్మం - అరణ్యలో క్షత్ర ధర్మం - కిష్కింధలో మిత్ర ధర్మం - సుందరలో స్వామి ధర్మం- యుద్ధలో వీర ధర్మం. మరి ఉత్తరలో రాజధర్మం. ఇలా ఏడు ఉత్తమ ధర్మాలు ప్రధానంగా కనిపిస్తాయి. అవి ఆయన సమగ్రమైన ధర్మ స్వరూపాన్ని మనకు కన్నులగట్టినట్టు సాక్షాత్కరింపజేస్తాయి.
బాల కాండలో శిష్య ధర్మ మన్నాము. ఎలాంటి దా శిష్య ధర్మం. ఎవరాయన శిష్యత్వం నెరపిన గురువులు. ఇద్దరే ఇద్దరు. ఒకరు ఆయన పుట్టక ముందు నుంచీ నిర్యాణ మయ్యేదాకా అనుసరిస్తూ వచ్చిన వసిష్ఠుడు. మరొకరు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వచ్చి వివాహం కాగానే నిష్క్రమించిన విశ్వామిత్రుడు. ఇద్దరూ ఇద్దరే మహానుభావులు. బ్రహ్మర్షిగానే ఉద్భవించి శక్తి పరాశర వ్యాసాది మహనీయులకు పితృ పితామహస్థానంలో ఉన్న వారొకరైతే - రాజర్షి అయినా తపః ప్రభావం చేత బ్రహ్మర్షి పదవి నందుకొని తన పేరు చెబితేనే మూడు లోకాలనూ గడగడలాడించి ఎంత రాజసుడో
Page 38