వాణ్ణి మట్టు పెట్టినట్టూ అవుతుంది. ఒక దెబ్బకు రెండు పక్షులు. అందుకే తన తత్వాన్ని మభ్యపరచి చివరిదాకా సాగిస్తూ వచ్చిన మహాభినయమిది. తనకు కాకపోయినా లోకాని కలాగే కనపడాలిగదా అలా కనపడటంవల్లనే తనకు సుగ్రీవాదులందరూ సాయపడుతూ వచ్చారు. రావణుడు మానవుడే కదా అనే నిర్లక్ష్యంతో బరవసాపడి మోసపోయాడు.
ఏమి. అలా మభ్యపరుచుకోవలసిన అవసరమేమిటి. కృష్ణుడిలాగా తన వైభవాన్ని బయటపడి ప్రదర్శించనే వచ్చు గదా - అంటే భాగవతం మాదిరిగాదు రామాయణం. భాగవతం పురాణమైతే రామాయణ మితిహాసం. పురాణం మోక్షపురాషార్థాన్ని బోధిస్తుంది. ఇతిహాస మలాకాక ధర్మ పురుషార్ధాన్ని ప్రధానంగా బోధిస్తుంది మనకు. ధర్మ పురుషార్ధ మన్నప్పుడది చెప్పేదిగాదు. చేసిచూపేది. ఆ చూపటం తనకోసంగాదు. మానవులకోసం. తాను చేసి చూపేది చూచి మానవులందరూ అలాగే చేయాలని తాత్పర్యం. ఇది మోక్షంలాగా ఏ కొందరుత్తమాధి కారులకో నియతమయింది కాదు. ధర్మమనేది సర్వలోకం సాధారణం. అది లోకులకు బోధించాలంటే యద్యదా చరతిశ్రేష్ఠః - అన్నట్టు తానాచరించి చూపాలి. అందుకోసం అద్భుతమైన లీలలూ మహిమలూ ప్రదర్శిస్తే లాభంలేదు. అవన్నీ మానవుల కతీతమైనవి. జీవితంలో వారికవి ఉపయోగపడవు. కనుక ఆయా వర్ణాశ్రమాల వారి కాయా లింగవయోవస్థాదుల కనుగుణంగా ఎవరికేది విహితమో అలాటి ధర్మం వారికి బోధిస్తూ అందుకు తన జీవితమే ఒక ఆదర్శంగా చూపుతూ వచ్చాడు పరామాత్మ. అందుకే ఏయే సందర్భాలలో మానవుడెలా ప్రవర్తిస్తాడో ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. అదంతా మానవ స్వభావానుకరణమేగాని నిజమైన ఆచరణం కాదు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతోనన్నట్టు ఒక నటుని లాంటివాడు పరమాత్మ. ఏ వేషం వేస్తే ఆ వేషాని కునుగుణంగా నటిస్తూపోతాడు. కృష్ణ వేషం వేసుకొని మోక్షపురుషార్థాని కనుగుణంగా ఆయాలీలలు ప్రదర్శిస్తూ వచ్చాడు.
Page 33