#


Index

వారు దానికి వగుస్తుంటే స్వామివారనుగ్రహిస్తారు వారిని. మూడు జన్మలలో నాతో విరోధం సాధించి వస్తారా లేక బహుజన్మలలో విహితంగా వస్తారా చెప్పండని. విరోధమైతే అయింది మూడు జన్మలలోనే ముగించుకొని వస్తామని సమాధాన మిస్తారు వారు. అలా వచ్చి జన్మించిన వారే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశివులూ - త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులూ - ద్వాపరంలో శిశుపాల దంత వక్త్రులూ, వారిని సంహరించటానికి ఆ శ్రీ మహావిష్ణువే అవతరించాడు. కృతంలో వరాహ నృసింహావ తారాలెత్తి హిరణ్యుల నంతమొందించాడు. ద్వాపరంలో కృష్ణావతారమెత్తి శిశుపాల దంతవక్త్రులను రూపుమాపాడు. మరి త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులను కూడా అ దేవుడే గదా సంహరించ వలసింది. అలాంటప్పుడు రాముడా విష్ణు దేవుని అవతారం గాక మరెవరవుతాడు. ఆ మూడూ అవతారాలయి ఇది ఒక్కటీ కాకపోతుందా. అలా చెప్పటం ఏమి బాగు ఏమి సబబు. పురాణ ప్రక్రియకే అది విరుద్ధం గదా.

  అంతే కాదు. రాముడవతార పురుషుడు కాడంటే అది పురాణాలకేగాక రామాయణానికి కూడా విరుద్ధమే. వేదవతిని విష్ణువుకే ఇచ్చి పెండ్లి చేయాలనుకున్నాడు తండ్రి. ఆయన సంకల్పం నెఱవేఱకుండానే మరణించాడు హఠాత్తుగా. తండ్రి సంకల్పం ఎలాగైనా సాధించాలని తపస్సు చేస్తుంది వేదవతి. మధ్యలో రావణుడు బలాత్కరించబోతే సహించలేక మరుజన్మలో సీతగా జన్మించి ఆ విష్ణువునే వివాహం చేసుకొని అతని చేత నిన్నూ నీవంశాన్నీ సమూలంగా నాశనం చేయిస్తానని శాపమిచ్చి యోగాగ్నిలో దగ్ధమవుతుంది. ఆవిడేగదా సీతగా అయోనిజ అయి జన్మించింది. మరి ఆవిడ చేసుకొన్న రాముడు విష్ణువుగాకపోతే ఆ ప్రతిజ్ఞ కర్ధమేముంది. అలాగే ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణుడి కిచ్చిన శాపవృత్తాంతం కూడా రాముడు దేవుడేననే సత్యాన్ని చాటుతున్నది.

Page 3